జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ సిఫార్సు చేసింది: ఎంపీ రఘురామ క్లెయిమ్, సజ్జలపై తీవ్ర అవినీతి ఆరోపణలు
రాజ ద్రోహం కేసు తర్వాత కూడా సొంత పార్టీపై, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శలు ఆరోపణలు కొనసాగిస్తోన్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పని పట్టే దిశగా వైసీపీ మరో అడుగు వేసింది. రఘురామ కంపెనీల్లో ఆర్థిక అవకతవకలపై ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని మోదీకి లేఖలు రాసిన వైసీపీ తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి నేరుగా ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై స్పందించిన రఘురామ.. సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలపై మళ్లీ ఎదురుదాడికి దిగారు. సీఎం జగన్ బెయిల్ రద్దు విచారణపైనా అసాధారణ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామ ఏమన్నారో ఆయన మాట్లోనే..

నిర్మలమ్మకు నేను కూడా రాస్తా
''సీబీఐ నమోదు చేసిన పలు కేసుల్లో ఏ1, ఏ2లుగా ఉన్న జగన్, విజయసాయిరెడ్డిలకు సంబంధించి మరింత లోతైన విషయాలతో, అవినీతి కలాపాలపై ఇప్పటికే రాష్ట్రపతికి, ప్రధాని మోదీకి లేఖలు రాశాను. నిన్న సాయిరెడ్డి ఆధ్వర్యంలో మావాళ్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసి, నాపై మళ్లీ ఫిర్యాదు చేశారు కాబట్టి ఆమెను నేను కూడా లేఖ రాయబోతున్నాను. లేఖతోపాటే సాయిరెడ్డి, జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిలకు సంబంధించిన ఆర్థిక అవకతవకల ఫైల్ ను కూడా పంపుతాను. ఈ సందర్భంగా మీడియాకు.. ఓబులాపురం మైనింగ్ కంపెనీకి, సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడికి, వాళ్లతో విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధంపై నేను కొన్ని విషయాలు చెబుతాను..

సజ్జల బ్రోకరేజీకి ప్రతిఫలం..
ఓబులాపురం మైనింగ్ కంపెనీకి లైజెన్ చేయడానికి సజ్జల దివాకర్ రెడ్డికి చెందిన 'రెడ్ బోల్డ్ ఎంటర్ ప్రైజెస్' ఓ అగ్రిమెంట్ చేసుకుంది. గాలి జనార్ధన్ రెడ్డి నుంచి ఐరన్ ఓర్ ఖనిజాన్ని తవ్వకం కాస్ట్ ప్రైజ్ కే సజ్జల కుటుంబం కొనుక్కుని, బయట అమ్ముకుంది. తద్వారా వచ్చిన ఆదాయం మొత్తాన్ని ఆర్ఆర్ గ్లోబల్ అనే కంపెనీలో పెట్టారు. అది సజ్జల సోదరుడి పేరుమీద ఉంది. ఆయన ఈ మధ్యే కాలంచేశారు. ఓబుళాపురం మైనింగ్ లైజెన్ చేసేందుకు జగన్ లైసెన్స్ ఇస్తే, అదే ఆర్ఆర్ గ్లోబల్ నుంచి సాక్షి మీడియా మాతృ సంస్థల్లోకి కోట్ల రూపాయాలు పెట్టుబడులు వచ్చాయి. బ్రోకరేజీ చేసినందుకు సజ్జల రామకృష్ణారెడ్డి అనంతర కాలంలో సాక్షిలో ఈడీగా, ఇప్పుడు జగన్ సర్కారుకు సలహాదారుగా ఉన్నాడు. ఇదంతా క్విడ్ ప్రోకో కాదా? ఇక,

అందుకే ఈ దొంగల కథ చెబుతున్నా..
వేణుంబాక విజయసాయిరెడ్డి కీలాన్ టెక్నాలజీస్ అనే పేపర్ కంపెనీని సృష్టించారు. దాంట్లో సాయిరెడ్డి భార్య సునంద, కూతురు నేహా పేర్లు కూడా ఉన్నాయి. రెయిల్ డార్ట్ ఇన్ఫ్రాటెక్ అనే మరో కంపెనీని కూడా పెట్టారు. కీలాన్ కంపెనీలో కోల్ కతా నుంచి ఎవరెవరో పెట్టుబడులు పెట్టారట. చివరికి ఆ కంపెనీలన్నీటినీ ఒకటి చేసి, సాయిరెడ్డి కుటుంబీకుల్ని రాజీనామా చేయించి, జగన్, భారతి భాగస్వాములై, కడకు ఆ కంపెనీలన్నిటినీ సండూర్ పవర్ కంపెనీలో కలిపేయడం ద్వారా మొత్తానికి వీరు అతిపెద్ద షేర్ హోల్డర్లుగా మారారు. ఇలాంటి పనులు చేసిన సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణలు నాపై ఫిర్యాదులు చేయడమా? వీళ్లకు సునీల్ కుమార్ తోడా? అందరికీ ఏ1 జగన్ నాయకత్వమా? నన్న దొంగ అన్నందుకే ఈ దొంగల కథ చెబుతున్నా.

జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ సిఫార్సు?
సీఎం జగన్ బెయిల్ రద్దుకు సంబంధించి నిన్న(సోమవారం) సీబీఐ కోర్టులో విచారణకు సంబంధించి కొన్ని విషయాలు చెప్పాలి. గతంలో లిఖిత పూర్వక వాదనలు ఇస్తాం, సమయం కావాలని అడిగిన సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు.. నిన్న జ్వరం కారణంగా వాయిదా కోరారు. నిజానికి పేపర్లు(లిఖిత పూర్వక వాదనలు) ఇస్తే సరిపోతుంది. ఒకవేళ సీబీఐ హెడ్డాఫీస్(ఢిల్లీ) నుంచే పత్రాలు రాకుండా ఉంటే, ఆ విషయమైనా కోర్టుకు చెప్పాల్సి ఉంది. జ్వరం కారణంగా వాయిదా కోరడంపై పిటిషనరైన నాకు చాలా అనుమానాలు వచ్చాయి. సీబీఐ లేఖ బహుశా చేరకూడని చోటికి చేరి ఉండొచ్చు, అందుకే లాయర్లు ఇద్దరూ అలా చేసిఉండొచ్చు. దీన్ని బట్టి సీబీఐ రాసిన లేఖలో జగన్ బెయిల్ రద్దు చేయాలనే సిఫార్సు చేసి ఉండొచ్చని నా అనుమానం. గతంలోనూ సీబీఐ జగన్ బెయిల్ రద్దుకు సిఫార్సు చేసింది. ఏదైమైనా ఈనెల 30న కోర్టు విచారణలో ఏదో ఒకటి తేలక తప్పదు'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.












Click it and Unblock the Notifications