జగన్ బెయిల్ రద్దయితే రచ్చబండ నాదే -గాలిపై సీబీఐ డబుల్ గేమ్ -వైసీపీ రౌడీల పార్టీనా: రఘురామ
సొంత పార్టీపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరో బాంబు విసిరారు. 'రాజధాని రచ్చబండ' పేరుతో దాదాపు ఏడాదిన్నరగా మీడియా సమావేశాలు నిర్వహిస్తోన్న రెబల్ ఎంపీ.. ఆ పేరుపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎంజగన్ బెయిల్ రద్దు, కర్ణాటకలోని బళ్లారికి చెందిన గాలి జనార్ధన్ రెడ్డి విషయంలో సీబీఐ ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్నదని ఆరోపించారు. వైసీపీని రౌడీల పార్టీ అని బీజేపీ నిందించడం, ఏపీలో మద్యపాన నిషేధం తదితర అంశాలపైనా శుక్రవారా నాటి ప్రెస్ మీట్ లో రఘురామ మాట్లాడారు. ఎంపీ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే...

జగనన్న మద్యపాన దీవెన..
''ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని మా జగనన్న చెప్పారు. అన్న వస్తున్నాడు.. మద్య నిషేధం తీసుకొస్తాడు అని చెప్పుకున్నారు. మేం కూడా అన్న పేరు తలుస్తూ గొంతు అరిగేలా తిరిగాం. అయితే, అన్న సీఎం అయ్యారు. మద్యనిషేధం కాస్తా ఇప్పుడు.. ''జగనన్న పరిపూర్ణ మద్యపాన దీవెన''గా మారింది. రాత్రి 8 గంటలు కాదు, 9 దాకా మద్యం దుకాణాలు తెరవాలన్న ఆదేశాలతో కూడిన ఫోన్ సంభాషణ ఒకటి ఇటీవల వైరలైంది. మద్యం ధరలు పెంచి, తాగుబోతుల్ని తాకట్టుపెట్టి ఇప్పటికే రూ.25వేల కోట్ల అప్పులు తెచ్చారు. రాబోయే..

ఆ సెల్ఫీ చావుకు బాధ్యులెవరు?
ఏపీలో రాబోయే 20 ఏళ్లు కూడా ''జగనన్న పరిపూర్ణ మద్యపాన దీవెన'' అమలు చేయాల్సినంత పెద్ద మొత్తంలో అప్పులు చేశారు. అసలు జగనన్న మద్యపానం వల్ల దీవెనలు ఎవరికి వెళుతున్నాయి, మద్యం తయారీదారులైన ఇద్దరు ముగ్గురికేనా, ఆ పేర్లు బయటికొస్తాయా? జగనన్న పథకం మద్యం తయారీదారులకు అక్షయపాత్రలా తయారైంది. ఇండియాలో ఎక్కడా లేని చట్టాలను ఈ మద్యపాన పథకం కోసం తీసుకొచ్చారు. విదేశాల నుంచి వచ్చినా 2 సీసాలు తెచ్చుకునే వీలుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ రెండు మద్యం సీసాలు తీసుకెళితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ అవే రెండు బాటిళ్లను ఏపీకి తీసుకెళితే అరెస్టు చేసి, అక్రమ కేసులు పెడతారు. ఇటీవలే తూర్పు గోదావరి జిల్లాలో ఓ వ్యక్తిపై ఇలా మద్యం సీసాల కేసుపెట్టడం, అతను సెల్పీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడటం చూశాం. ఈ చావుకు సీఎం బాధ్యుడు కాదా? మా పార్టీ అధ్యక్షుడు జగన్ మద్యపాన నిషేధం అని చెబితే, దానిని ముఖ్యమంత్రి జగన్ వ్యతిరేకించడమేంటి? ఇప్పటికీ వైసీపీలో కొనసాగుతోన్న సభ్యుడిగా బాద్యతతో ఈ ప్రశ్న అడుగుతున్నా..

భార్యా కూతురిని కారు దించేసి..
ఇటీవల గుంటూరు జిల్లాలో, నా స్నేహితుడు తన ఫ్యామిలీతో వెళుతోంటే వాళ్లను ఆపేసి, భార్యా, బిడ్డలను కారు దింపించారు. ఏంట్రా అంటే, కారులో మద్యం సీసాలు ఉన్నాయేమో చెక్ చేయాలన్నారట. అసలేంటీ వేధింపులు? మీ వాళ్లు తయారు చేసిన చెత్త మద్యాన్నే మీరు నిర్దేశించిన ధరలకే తాగాలా? మీ మద్యం అమ్మకాలు పడిపోతాయని ఎవరినీ ప్రయాణాలు చేయనియ్యరా? మద్యం అమ్మకాలు పడిపోతే రాష్ట్ర ఆదాయం కంటే మీ వ్యక్తిగత ఆదాయం పడిపోతుందా? అన్నట్లుగా ఉంది. ఏ విషయంలో ఎక్కడా లేని క్రమ శిక్షణ ఒక్క మద్యం విషయంలోనే పెడుతుండటం, పక్కా రాష్ట్రాల నుంచి మద్యం సీసాలు రానీయకుండా ఉండేందుకే గతంలో కొన్ని రోజులపాటు ఆర్టీసీ బస్సులను కూడా ఆపేశారని చెప్పుకున్నారు. ఎందుకింత తపన? ప్రజలపై ఇంత శ్రద్ధ చూపుతోన్న సీఎంగారు తన సొంత బాబాయి హత్య విషయంలో మాత్రం శ్రద్ద పెట్టకూడదా?

సాయిరెడ్డికి సీబీఐ పిలుపు?
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ఎంక్వైరీ నడుస్తోంంది. గొడ్డలి వేటును గుండెపోటు అన్నది ఎవరు? అతన్ని విచారించాలని నేను డిమాండ్ చేశాను. జగన్ బాబాయి మాకు అందరికీ బాబాయే కాబట్టి దోషులు తొందరగా దొరకాలని ఆశిస్తున్నాం. అసలు దోషుల్ని పట్టుకోడానికి సీఐడీకి చాలా సమయం పడుతుండటంతో, కేసును సీబీఐకి అప్పగించారు. వాళ్లు కూడా సుదీర్ఘంగానే విచారిస్తున్నారు. వివేకా హత్య జరిగి ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యాయి. కేంద్ర హోం మంత్రిని కలిసిన ప్రతిసారి వివేకా హత్యను తేల్చేయాలని జగన్ అడుగుతూనే వస్తున్నారు. అయినాకూడా కేసు ఆలస్యం అవుతోంది. గొడ్డలి వేటును గుండెపోటు అన్న విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలని జగన్ కూడా కోరి ఉండొచ్చు, నేను కూడా అదే అడుగుతున్నాను. ఇప్పటికైనా జగన్ శ్రద్ధ తీసుకుని, ప్రభుత్వం నుంచి మరింత సహకారం ఇవ్వాలి. ఎవరెవరో వీఐపీలు ఈ కేసులో ఉన్నారు అంటున్నారు. అవతల ఎంతటివాళ్లు ఉన్నా గొడ్డలివేటుకు గురైంది సొంత బాబాయి కాబట్టి జగన్ ఎవరినీ ఉపేక్షించొద్దు. ప్రజల మీద చూపుతోన్న శ్రద్ధనే బాబాయి హత్యపైనా చూపాలి..

రౌడీల పార్టీ అన్నాకా మంత్రి పదవా?
జగన్ నాయకత్వంలోని వైసీపీని రౌడీ పార్టీ అని బీజేపీ వాళ్లు విమర్శిస్తున్నారు. రౌడీ పార్టీతో పొత్తు లేదు అని కాషాయ నేతలు అంటున్నారు. వైసీపీలో ఒకరిద్దరు రౌడీలు ఉండొచ్చేమోగానీ, మొత్తం పార్టీనే రౌడీల పార్టీ అనడం బాధాకరం. వైసీపీ రౌడీల పార్టీ అని, వాళ్లతో పొత్తు పెట్టుకోబోమని, జగన్ కు వ్యతిరేకంగా ధర్నాలు చేశామని బీజేపీ నేతలు చెప్పారు. ఆ పార్టీ వాళ్లు మా వాళ్లను ఇంత దారుణంగా ఎందుకు తిట్టాల్సి వచ్చింది? ఒకవైపు, కేంద్ర ప్రభుత్వంలో చేరాల్సిందిగా వైసీపీని బీజేపీని అడిగితే, కేంద్ర మంత్రి పదవి తీసుకోడానికి విజయసాయిరెడ్డి వద్దన్నాడని వార్తలు వచ్చాయి. ఇటేమో అదే బీజేపీ వాళ్లు మమ్మల్ని రౌడీలని తిడుతున్నారు. బీజేపీ నిజం చెప్పేసింది కాబట్టి, సాయిరెడ్డి ఇకనుంచైనా సరే పిచ్చి పిచ్చి లీకులు ఇవ్వకుంటే మంచిది. వివేకాది గుండెపోటు అన్న సాయిరెడ్డిని కూడా ప్రశ్నిస్తారు. ఇప్పటికే సాక్షి విలేకరిని కూడా సీబీఐ ప్రశ్నించిందట. గుండెపోటు అనే మాట ఎందుకు వచ్చిందో బయటికి రావాలి. చిన్న తప్పులను కూడా సహించని వ్యక్తిగా సాయిరెడ్డిని ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరి గొడ్డలి వేటును గుండెపోటుగా ఎందుకు చెప్పారో తేలాలి. మరో ముఖ్యమైన విషయం..

గాలిని పోవద్దని, జగన్ను విడుస్తారా?
ఆర్థిక నేరాలకు పాల్పడిన వాళ్ల విషయంలో సీబీఐ చాలా సార్లు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నది. మన పక్కనే బళ్లారికి చెందిన గాలి జనార్ధన్ రెడ్డి సొంతూరుకు వెళతానని సుప్రీంకోర్టులో మొరపెట్టుకున్నా సీబీఐ కనికరించలేదు. గాలి ఊరికి వెళితే సాక్ష్యులను ప్రభావితం చేస్తాడని సీబీఐ ఆరోపించింది. గాలి కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. మరి అదే శ్రీలక్ష్మి ఏపీలో సీఎస్ స్థాయిలో ఉన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా, ఆయన సహనిందితులు, సాక్ష్యులు కీలక పదవుల్లో ఉన్నారు. అవతల గాలి ఊరికి పోతేనే కేసు తారుమారవుతుందని భయపడుతోన్న సీబీఐ.. ఇక్కడ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా బెయిల్ రద్దు కోరకపోవడం నాకైతే ఆశ్చర్యంగా ఉంది. నిజానికి..
Recommended Video

బెయిల్ రద్దయితే రచ్చబండ మనదే
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు అంశంపై నన్ను అనవసరంగా నిందిస్తున్నారు. ప్రత్యర్థులు ఆయనను నానా మాటలు అంటుంటో వినలేక, ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే విచారణకు హాజరు కాలేకపోతున్నానని ఆయనే స్వయంగా చెప్పాక, తాను కడిగిన ముత్యంలా ప్రజల్లో నిలబడాలనే లక్ష్యంతోనే బెయిల్ రద్దయితే కేసులు త్వరగా పూర్తవుతాయన్న ఉద్దేశంతోనే నేను బెయిల్ రద్దు పిటిషన్ వేశాను. నేను ఇప్పటికీ బాధ్యత గల వైసీపీ కార్యకర్తనే. రెండేళ్ల పాటు ఇంట్లో నుంచి కాలు బయటపెట్టని ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే, అంటే, సెప్టెంబర్ లో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కనీసం కనీసం ఇప్పుడైనా రచ్చబండ పేరుతో జనాల్లోకి సీఎం వస్తుండటం శుభపరిణామం. ప్రత్యక్షంగానైనా ప్రజల కష్టాలు ఆయనకు తెలుస్తాయి. మరి సీఎంగారే రచ్చబండ మొదలుపెడితే, నేను నిర్వహిస్తోన్న కార్యక్రమం సంగతేంటాని ఆలోచించా. సీఎం బెయిల్ రద్దు కాకుంటే ఆ పేరుతో ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒక వేళ బెయిల్ రద్దయినా, సీఎం ప్రోగ్రామ్ ఇంకా ఆలస్యమైనా రచ్చబండ పేరుతోనే ముందుకెళదామని అనుకుంటున్నాను..'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.
-
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications