జగన్ ఉచిత పథకాలపై సంచలనం -అడ్డుకోవాలంటూ ప్రధాని మోదీకి వైసీపీ ఎంపీ రఘురామ విన్నపం
సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్ పై అదే పనిగా విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో సంచలనానికి తెరలేపారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అమలు చేస్తోన్న భారీ ఉచిత సంక్షేమ పథకాలను, ఇలాంటివే ఇతర రాష్ట్రాల్లోనూ అమలవుతోన్న స్కీములపై అనూహ్య వ్యాఖ్యలు చేస్తూ, వాటిని కట్టడి చేయాల్సిందిగా కేంద్ర సర్కారును అభ్యర్థించారు. ఉచిత స్కీముల వ్యవహారంలోకి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీనే జోక్యం చేసుకోవాలంటూ కీలక ప్రతిపాదనలు చేశారు. అమరావతి భూకుంభకోణం, ఏపీ సర్కారు పెట్టిన కేసులపైనా ఎంపీ రఘురామ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అమరావతి భూకుంభకోణంలో ట్విస్ట్ -చంద్రబాబుపై సీఐడీకి ఆధారాలు -మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు భద్రత పెంపు
స్కీములపై లోక్సభలో చర్చ..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్ సభలో ''అత్యవసర ప్రజా ప్రాముఖ్యత'' అనే అంశంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. ప్రజలను జాగ్రత్తగా చూసుకోవటానికి సంక్షేమ పథకాలు చాలా ముఖ్యమైనవంటూనే, కొన్ని రాష్ట్రాలు తమ ఆదాయాన్ని మించి సంక్షేమం కోసం ఖర్చులు చేస్తున్నాయని, బడ్జెట్ తాహతుకు మించి అప్పులు చేసి మరీ విచ్చలవిడిగా సంక్షేమం పేరుతో ఖర్చుపెట్టడమనే సంస్కృతితో రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవని, వీటిని కేంద్రం చూస్తూ కూర్చోరాదన్నారు రఘురామ.
ప్రధాని మోదీ జోక్యం అవసరం..
''మంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రాలను చూస్తున్నాం. కాని కొన్ని రాష్ట్రాలు మాత్రం సంక్షేమ పథకాలు కోసం ఆదాయానికి మించి ఖర్చు చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో వాషింగ్ మెషిన్ల నుంచి ఇంటికీ రేషన్ తెచ్చి ఇస్తామని చెబుతున్నాయి. సంక్షేమ పథకాల తాలూకు వాగ్దానాలు రాష్ట్ర బడ్జెట్ ను మించిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లోనైతే కేవలం సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటున్నాయి. ఇలా ఉచిత సంక్షేమ పథకాలకు కూడా అప్పులిస్తూ పోతే బ్యాంకులు కూడా అతి త్వరలోనే నష్టాల్లో కూరుకుపోతాయి. కాబట్టి ఈ వ్యవహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే జోక్యం చేసుకొవాలి..''అని ఎంపీ రఘురామ అన్నారు. అంతేకాదు..
ఉచిత పథకాల కట్టడి..
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ సరుకుల్ని ఉచితంగా ఇంటింటికీ సరఫరా చేస్తూ జగన్ సర్కారు ప్రవేశపెట్టిన పథకాన్ని ప్రస్తుతం ఎన్నికలు జరుగుతోన్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లోనూ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టడం తెలిసిందే. తమిళనాడులో అన్నాడీఎంకే, బెంగాల్ లో అధికార టీఎంసీ పార్టీలు జగన్ మార్కు స్కీమును అమలు చేస్తామని వాగ్ధానాలిచ్చాయి. ఆయా రాష్ట్రాల పేర్లను ప్రస్తావించకుండానే ఉచిత పథకాలపై వైసీపీ ఎంపీ రఘురామ కేంద్రానికి కీలక ప్రతిపాదన చేశారు. ప్రతి రాష్ట్రానికి తన ఆదాయంలో కొంత శాతాన్ని మాత్రమే ఉచిత సంక్షేమ పథకాలకు కేటాయించేలా జాతీయ స్థాయిలో ఒక నిర్ధిష్ట ప్రణాళికను కేంద్రమే రూపొందించాలని, దీనిపై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంపీ రఘురామ సూచించారు. ఇక..
ఎంపీ రఘురామకు ఊరట..
ఎంపీ రఘురామ గురువారం ఢిల్లీలో 'రాజధాని రచ్చబండ' పేరుతో మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు అమలుచేస్తోన్న ఉచిత పథకాల, ఎంపీలను రాష్ట్రంలోకి రానీయకుండా పోలీసులు కేసులు పెట్టిన వైనం తదితర అంశాలను పార్లమెంటులో ప్రస్తావించానని తెలిపారు. సొంత నియోజకవర్గం నర్సాపురానికి వెళ్లనీయకుండా సర్కారు తప్పుడు ఎఫ్ఐఆర్ లతో కేసులు పెట్టించిందనీ లోక్ సభలో ప్రస్తావించినట్లు ఎంపీ తెలిపారు. ఈ వ్యవహారంలో ఏపీ హైకోర్టు రఘురామకు భారీ ఊరట కల్పించింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించిన న్యాయస్థానం.. రఘురామపై నమోదైన కేసులపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒకే తీరుగా ఇన్ని కేసులు ఎలా పెడతారంటూ జడ్జిలు విస్మయం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు..
అట్రాసిటీ చట్టంతో ఆటలు..
రాజధాని రచ్చబండలో భాగంగా అమరావతి భూకుంభకోణం వ్యవహారంపై ఎంపీ రఘురామ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఎస్సీలు వివక్షకు గురైనప్పుడు వారికి రక్షణగా నిలిచే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలను జగన్ సర్కారు యధేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నదని, ఒక ఎస్సీ మరో ఎస్సీపైన కూడా అట్రాసిటీ కేసు పెట్టడానికి వీల్లేదని, అలాంటిది రెడ్డి కులస్తుడైన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మరో అగ్రకులానికి చెందిన చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టడం అత్యంత దారుణమని, ఆర్కే ఏమైనా దళితుడా? అని రఘురామ ప్రశ్నించారు. దీన్ని బట్టి..
75కు 74 వచ్చినా జగన్కు తృప్తి లేదు
ఏపీలో జరుగుతోన్న పరిణామాలను చూస్తే అక్కడ భారత రాజ్యాంగం అమలవుతున్నదా, లేక జగన్ రాజ్యాంగం నడుస్తోందా అనే అనుమానం తలెత్తుతుందని, గత ప్రభుత్వం రైతులను ఒప్పించి రాజధానికి భూములు తీసుకుంటే, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందంటూ తప్పుడు కేసులు పెట్టారని వైసీపీ రెబల్ ఎంపీ మండిపడ్డారు. ఇటీవలి పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని ప్రస్తావిస్తూ, ''75 మున్సిపాలిటీలకు 74 మున్సిపల్ చైర్మన్లు వచ్చినా జగన్ సంతృప్తి చెందడం లేదని, వైసీపీ అనుచిత తీరు వల్ల తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ దివాకర్ రెడ్డి అనే ప్రచారమే తప్ప, మిగతా 74 మున్సిపాలిటీల్లో వైసీపీ చైర్మన్ల పేర్లు కూడా సోయిలో లేకుండా పోయాయి'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.