మీకూ ఉన్నారు ఏం లాభం?, 5మందితోనైనా పార్లమెంటును వణికించామా? లేదా?: రోజా
చిత్తూరు: ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంటులో ఏపీ అధికార, ప్రతిపక్షాలు గట్టిగా ఫైట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు పార్టీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చినా.. సభ ఆర్డర్ లో లేదన్న కారణంగా స్పీకర్ వాయిదా వేస్తూ వస్తున్నారు.
ఇక ఇటు రాష్ట్రంలో కేంద్రంపై పోరాటం విషయంలో తామే ఎక్కువగా పోరాడుతున్నామని అటు వైసీపీ, ఇటు టీడీపీ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ఎంపీల పోరాటానికి మద్దతుగా చిత్తూరు జిల్లా పుత్తూరులో నిర్వహించిన మానవహారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో ఎంత మంది ఉన్నాం అనేది పాయింట్ కాదని... పార్లమెంటును వణికించామా? లేదా? అనేదే ముఖ్యమని ఆమె కామెంట్ చేశారు.
తమ పార్టీకి ఐదు మంది ఎంపీలు మాత్రమే ఉన్నప్పటికీ... తమ అధినేత జగన్ ఆదేశాలతో పోరాడుతున్నామని తెలిపారు. చంద్రబాబు పార్టీకి ఎక్కువమంది పార్టీలు ఉండి ఏం లాభమని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఏ రోజూ చంద్రబాబు కృషి చేయలేదని విమర్శించారు. వైసీపీ అవిశ్వాసం పెడితే మద్దతునిస్తామని మొదట ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం ఆ క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.