Vijayasai Reddy: వైసీపీ ఎంపీకి కేంద్ర ప్రభుత్వం భలే ఛాన్స్: పిలిచి మరీ కీలక బాధ్యతలు
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డికి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. పార్లమెంట్ ఉభయ సభల్లో కొన్ని రకాల కీలక బిల్లులపై అధికార పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్నప్పటికీ.. పిిలిచి మరీ కీలక బాధ్యతల్లో ఆయనను భాగస్వామిని చేసింది. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తోన్న బీజేపీ- ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మధ్య సత్సంబంధాలు లేవంటూ వస్తోన్న వార్తల నేపథ్యంలో- విజయసాయి రెడ్డికి ఆ కీలక పదవికి అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
కీలకమైన పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా విజయసాయి రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కో ఆర్డినేషన్ సెక్షన్ సెక్రెటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ కొద్దిసేపటి కిందటే పార్లమెంటరీ బులెటిన్ను విడుదల చేశారు. విజయసాయి రెడ్డితో పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన డాక్టర్ సుధాంశు త్రివేదిని కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యునిగా తీసుకున్నారు. ఈ విషయాన్ని దేశ్ దీపక్ వర్మ తెలిపారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఇద్దరు సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని కోసం ఎన్నికలను నిర్వహించింది రాజ్యసభ. ఈ ఎన్నికల్లో విజయసాయి రెడ్డి, సుధాంశు త్రివేది నామినేట్ అయ్యారు.

పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థల అకౌంట్లను తనిఖీ చేసే అధికారం దీనికి ఉంటుంది. సాధారణంగా లోక్సభలో ప్రతిపక్ష నేత ఈ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి పీఏసీ ఛైర్మన్గా ఉంటోన్నారు. లోక్సభ, రాజ్యసభల నుంచి ఎంపిక చేసిన వారిని ఏ కమిటీలోకి సభ్యులుగా తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాజ్యసభ వరకు ఖాళీగా ఉన్న ఈ రెండు స్థానాలను కూడా విజయసాయి రెడ్డి, సుధాంశు త్రివేదిలతో భర్తీ చేసినట్లు దేశ్ దీపక్ వర్మ తన బులెటిన్లో పేర్కొన్నారు.
విజయసాయి రెడ్డిని నామినేట్ చేయడంతో బీజేపీ-వైసీపీ మధ్య ఎలాంటి పొరపచ్చాలు గానీ, విభేదాలు గానీ లేవనే భావించుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. వైఎస్సార్సీపీకే చెందిన నర్సాపురం లోక్సభ సభ్యుడు, తిరుగుబాటు నేతగా ముద్రపడిన రఘురామ కృష్ణంరాజు కొద్దిరోజులుగా విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. విజయసాయి రెడ్డిపై ఆయన స్పీకర్ ఓం బిర్లాకు కూడా ఫిర్యాదు చేఃశారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను బట్టి చూస్తే.. రఘురామ కృష్ణంరాజు చేసిన ఫిర్యాదులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనట్టే కనిపిస్తోందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications