చంద్రబాబు పడగొడితే-జగన్ నిలబెట్టారు-ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు
ఏపీకి ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి ఏర్పాటైన కేంద్ర హోం శాఖ త్రిసభ్య కమిటీ సమావేశం నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వేర్వేరు చోట్ల స్పందించారు. ఇందులో మచిలీపట్నం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శ్రీ వల్లభనేని బాలశౌరి ప్రత్యేక హోదా డిమాండ్ పై సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబును పోల్చారు.
ప్రత్యేక హోదాపై కేంద్రం స్పందించడం చాలా సంతోషకరమైన వార్త అని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తెలిపారు. సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీ వచ్చినా ప్రధాని మోడీ, అమిత్షా దగ్గర ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారని ఆయన గుర్తుచేశారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు, తన స్వార్థం కోసం ప్యాకేజీకి ఒప్పుకుని, హోదా రాకుండా అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు కేంద్ర హోం శాఖ నియమించిన త్రిసభ కమిటీ సమావేశంలో హోదా అంశాన్ని చేర్చడం శుభ పరిణామమని బాలశౌరి తెలిపారు. తాము పార్లమెంటులో ప్రతి సమావేశంలో హోదా గురించి అడుగుతూనే ఉన్నామని,. ఇదే పట్టుదలతో ఎంపీలు అందరం, జగన్ సలహా, సూచనలకు అనుగుణంగా పని చేసి, హోదా సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు.
హోదా అనేది ముగిసిన అధ్యాయమని చెప్పుకోవడం సిగ్గుచేటని బాలశౌరి అన్నారు. ఎందుకంటే హోదా అనేది మన హక్కు. కానీ దాన్ని నీరుగార్చి, హోదా రాకుండా చేసింది చంద్రబాబేనన్నారు. విభజన సమయంలో హామీ ఇచ్చారు. కాబట్టి దాని సాధన కోసం సీఎం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారని. ఆయన కృషి వల్లనే త్రిసభ్య కమిటీ సమావేశంలో హోదా అంశాన్ని కూడా చేర్చారన్నారు.. హోదా ముగిసిన అధ్యాయమని మాట్లాడిన చంద్రబాబు, టీడీపీ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని బాలశౌరి ప్రశ్నించారు. ఇకనైనా వారు తమ వైఖరి మార్చుకోవాలన్నారు.. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి ముందుకు రావాలన్నారు. విభజన తర్వాత ఆస్తుల పంపిణీతో సహా, అనేక అంశాలపై ఇంకా వివాదాలు నెలకొన్నాయని, వాటన్నింటినీ సాధించుకోవాల్సి ఉందన్నారు. అందుకే జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి హోదాతో సహా, మిగిలిన వాటన్నింటి గురించి అడుగుతూనే ఉన్నారన్నారు.