ఎట్టకేలకు లాభాల్లో ఏపీఎస్ఆర్టీసీ-15 ఏళ్ల తర్వాత- జగన్ దూరదృష్టి అంటూ సాయిరెడ్డి ట్వీట్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలిసారి నష్టాల బాటలోకి వెళ్లిన ఏపీఎస్ ఆర్టీసీ ఆ తర్వాత తిరిగి కోలుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆర్టీసీని నష్టాలు వెంటాడాయి. అలాగే ఏపీఎస్ఆర్టీసీ నుంచి విడిపోయిన టీఎస్ఆర్టీసీని కూడా నష్టాలు వీడలేదు. అయితే తాజాగా కరోనా తర్వాత తీసుకున్న చర్యలతో ఏపీఎస్ఆర్టీసీ లాభాల బాటలోకి వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
గతంలో స్వతంత్ర సంస్ధగా, కార్పోరేషన్గా ఉన్న ఆర్టీసీలో ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్ధితే ఉండేది కాదు. నిరంతరం సమ్మెలతో సతమతం అయ్యేది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక గతంలో ఇచ్చిన హామీ మేరకు దాదాపు 53 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేశారు. ఆ తర్వాత కరోనా కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించి లాభాల బాటలోకి వచ్చినట్లు వైసీపీ ఎంపీ సాయిరెడ్డి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఆయన తన తాజా ట్వీట్లో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ 15 ఏళ్ల విరామం తర్వాత ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని, గాడిన పడిందని తెలిపారు.
సీఎం జగన్ దూరదృష్టి వల్ల ఆర్టీసీ లాభాల బాటలోకి వచ్చిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో చంద్రబాబు పాలన నాటి పరిస్దితులతో సాయిరెడ్డి తాజా పరిణామాలను పోల్చారు. చంద్రబాబు హయాంలో తన వారికి ఆర్టీసీని కట్టబెట్టేందుకు ప్రయత్నించారని, జగన్ ప్రభుత్వంలో విలీనం చేసి మాట నిలబెట్టుకున్నారని, ఇలా ఒక్క ప్రభుత్వ సంస్ధనైనా నిలబెట్టావా చంద్రబాబు అంటూ సాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. దీంతో సాయిరెడ్డి ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
సీఎంగారి దూరదృష్టి వల్ల APSRTC గాడిన పడింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత లాభాల్లోకొచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉండగా ఆర్టీసీని తన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నించాడు. జగన్ గారు ప్రభుత్వంలో విలీనం చేసి - మాట నిలబెట్టుకున్నారు. ఒక్క ప్రభుత్వ సంస్థనైనా ఇలా నిలబెట్టావా చంద్రబాబూ?
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 15, 2021