చంద్రబాబు అసెంబ్లీ బాయ్ కాట్-ఇక ఆ అవసరం రాదంటూ సాయిరెడ్డి సెటైర్లు
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోతున్న రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఏపీ అసెంబ్లీ బడ్డెట్ సమావేశాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఇందులో టీడీపీ పాల్గొంటుందా లేదా అన్న దానిపై చర్చ జరుగుతోంది. దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ఓ ట్వీట్ లో టీడీపీపై సెటైర్లు వేశారు.
సీఎం అయ్యాకే తిరిగి సభలో అడుగుపెడతానంటూ గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని గుర్తుచేసిన విజయసాయిరెడ్డి... జయలలిత స్టైల్లో శపథాలు చేశారంటూ దెప్పి పొడిచారు. అప్పట్లో సీఎం అయ్యాకే అసెంబ్లీకి వెళ్తానని చెప్పి.. ఇప్పుడు బడ్డెట్ సమావేశాలకు వెళ్లాలా వద్దా అంటూ సమీక్షలు చేస్తున్నారంటూ సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎడు పదులు దాటిన వయస్సులో ఈ ఉత్తుత్తి శపథాలు అవసరమా బాబూ అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా భవిష్యత్తులో ఏం జరగబోతోందో కూడా చెప్పేశారు.
ఇకపై భవిష్యత్తులో అసెంబ్లీని బాయ్ కాట్ చేసి వెళ్లే అవసరమే రాదంటూ సాయిరెడ్డి స్పష్టం చేశారు. జనమే మిమ్మల్ని అసెంబ్లీ నుంచి బహిష్కరిస్తారంటూ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తద్వారా చంద్రబాబు తిరిగి గెలిచి అసెంబ్లీకి రారనే అర్ధం వచ్చేలా సాయిరెడ్డి ట్వీట్ చేశారు. దీంతో సాయిరెడ్డి ట్వీట్ పై చర్చ జరుగుతోంది. ఇప్పటికే అసెంబ్లీకి హాజరయ్యే అంశంలో టీడీపీ మల్లగుల్లాలు పడుతుండగా.. ఉత్తుత్తి శపథాలు అంటూ వ్యాఖ్యానించడం ద్వారా సాయిరెడ్డి చంద్రబాబును రెచ్చగొడుతున్నట్లు అర్ధమవుతోంది.