ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఎవరికనేది స్పష్టం చేసిన విజయసాయి రెడ్డి
అమరావతి: భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి.. అనూహ్యంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ పేరును తెర మీదికి తీసుకొచ్చింది. తమ తరఫున అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేసింది. దీనితో అప్పటివరకూ ప్రచారంలో ఉన్న కేంద్ర మాజీమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పేర్లు తెరమరుగయ్యాయి. వెంకయ్య నాయుడిని మరోసారి కొనసాగిస్తారనే ప్రచారానికీ తెర పడింది.

10న ముగియనున్న పదవీ కాలం..
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10వ తేదీన ముగియనుంది. ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అదే నెల 6వ తేదీన పోలింగ్ను నిర్వహించనుంది. దీనికి ఏర్పాట్లు సాగుతున్నాయి. అంతకంటే ముందు రాష్ట్రపతి ఎన్నిక ఉంటుంది. సోమవారమే కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం పోలింగ్ జరుగనుంది. అదే రోజున పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా మొదలు కానున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల కోలాహలం నెలకొని ఉంది.
జగ్దీప్ అభ్యర్థిత్వంపై..
ఎన్డీఏ నుంచి జగ్దీప్ ధన్కర్ అభ్యర్థిత్వం ఖరారు కాగా.. ప్రతిపక్ష యూపీఏ సంకీర్ణ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. రేపో, మాపో యూపీఏ ప్రతిపాదిత ఉప రాష్ట్రపతి అభ్యర్థి పేరు తెర మీదకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. జగ్దీప్ ధన్కర్ అభ్యర్థిత్వాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతించినట్టే. ఆగస్టు 6వ తేదీన నిర్వహించబోయే ఎన్నికల్లో ఆయనకే ఓటు వేయడం కూడా దాదాపుగా ఖాయమైనట్టే. జగ్దీప్ పేరును ప్రకటించిందనే విషయం సంతోషాన్నిచ్చిందంటూ వ్యాఖ్యానించింది వైఎస్ఆర్సీపీ.

సాయిరెడ్డి అభినందనలు..
ఎన్డీఏ తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన జగ్దీప్ ధన్కర్కు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి కిందటే హిందీలో ట్వీట్ చేశారు. జగ్దీప్ ధన్కర్ను రైతు పుత్రుడిగా అభివర్ణించారు. ఎన్డీఏ అభ్యర్థిగా ఎన్నిక కావడం సంతోషాన్ని ఇస్తోందని వ్యాఖ్యానించారు. ఉప రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలను అందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. దేశ గౌరవాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు.

ఎన్డీఏ వైపే
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడి హోదాలో ఆయన ఈ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి వైపే మొగ్గు చూపుతామనే విషయాన్ని అనధికారికంగా ప్రకటించినట్టయింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటికే వైసీపీ.. ఎన్డీఏకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ద్రౌపది ముర్ముకు ఓటు వేయాలంటూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఎంపీలు, ఎమ్మెల్యేలకు సూచించారు.












Click it and Unblock the Notifications