రాజధానులపై నిర్ణయాధికారం అసెంబ్లీకే-రాజ్యసభలో సాయిరెడ్డి బిల్లు-హైకోర్టు అమరావతి తీర్పుతో..
ఏపీలో చంద్రబాబు తీసుకొచ్చిన అమరావతి రాజధాని స్ధానంలో మూడు రాజధానుల్ని తీసుకొచ్చిన వైసీపీ సర్కార్.. వాటిని అమల్లోకి తీసుకురావడంలో మాత్రం విఫలమైంది. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై పూర్తి నిర్ణయాధికారం లేకపోవడమే. చట్ట, కార్యనిర్వహక అనుమతులు తీసుకున్నా న్యాయపరంగా అనుమతి దొరక్కపోవడంతో మూడు రాజధానులు కలగానే మిగిలిపోయేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై ఇవాళ పార్లమెంటులో ఇవాళ ఓ కీలక బిల్లు ప్రవేశపెట్టారు.
రాజధానిపై వైసీపీ కష్టాలు
అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తీసుకొచ్చేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే హైకోర్టు దీన్ని తోసిపుచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా, అసెంబ్లీలో మరో బిల్లు ప్రవేశపెట్టకుండా వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది. దీంతో మూడు రాజధానులపై జనంలో భ్రమలు కూడా తొలగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీ మరోసారి అప్రమత్తమైంది. కేంద్రం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి మూడు రాజధానుల్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
అసెంబ్లీకే అధికారం కోరుతూ బిల్లు
అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ఆమోదించినా అది చట్టపరంగా చెల్లుబాటు కాకపోవడంతో వైసీపీ ఇరుకున పడింది. ఇప్పుడు మూడు రాజధానుల పేరెత్తేందుకే ఆలోచించాల్సిన పరిస్ధితి. దీంతో కేవలం అసెంబ్లీకే మూడు రాజధానుల్ని నిర్ణయించే అధికారం ఉండేలా చట్ట సవరణ చేయాలంటూ వైసీపీ పార్లమెంటులో ఇవాళ ఓ బిల్లు ప్రవేశపెట్టింది. రాజధానులపై అసెంబ్లీకి విస్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగ సవరణ కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు.
సాయిరెడ్డి బిల్లులో ఏముంది?
ఒక రాష్ట్ర పరిధిలో రాజధానుల ఏర్పాటుపై ఆ రాష్ట్ర శాసనసభకు విస్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగ సవరణ కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇవాళ రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా ఒకటి అంతకంటే ఎక్కువ రాజధానుల ఏర్పాటు చేసే అధికారం వాస్తవానికి ఆయా రాష్ట్ర శాసన వ్యవస్థకే ఉందని ఆయన బిల్లులో తెలిపారు. అయితే దీనిపై మరింత స్పష్టత కోరుతూ ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి చట్టబద్దంగా తిరుగులేని అధికారం కల్పించే ఉద్దేశంతో ఆర్టికల్ 3ఏని చేరుస్తూ రాజ్యాంగ సవరణ చేపట్టడం ఈ బిల్లు ఉద్దేశంగా ఆయన పేర్కొన్నారు.
కేంద్రం తన అధికారం వదులుకుంటుందా?
వాస్తవానికి మూడు రాజధానుల విషయంలో పదే పదే వినిపించిన విషయం కేంద్రం పాత్ర. అమరావతికి గతంలో ఒప్పుకున్న కేంద్రం.. ఆ తర్వాత ప్రభుత్వం మారి మూడు రాజధానులు తెరపైకి తెస్తే ఒప్పుకోవాలా వద్దా అనే విషయంలో సందిగ్ధం నెలకొంది. అయితే కేంద్రం మాత్రం వైసీపీతో కొనసాగిస్తున్న సత్సంబంధాల నేపథ్యంలో రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని తేల్చిచెప్పింది.
తద్వారా గతంలో చంద్రబాబు ఎంపిక చేసిన అమరావతి విషయంలో తమ నిర్ణయం కరెక్టే అని స్పష్టం చేసింది. అయితే రాజ్యాంగ సవరణ చేసి అసెంబ్లీకే రాజధాని నిర్ణయాధికారం ఇచ్చేస్తే ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూ పోతే అప్పుడేం చేయాలన్న దానిపై కేంద్రం ఇరుకునపడే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు కేంద్రం తన అధికారాల్ని వదులుకుని అసెంబ్లీ చేతుల్లో దీన్ని పెడుతుందా అంటే అవకాశం లేదనే చెప్పవచ్చు.