టీడీపీ మ్యానిఫెస్టోపై విజయసాయిరెడ్డి ట్వీట్ వార్-ఇవాళ్టి టాపిక్ ఇదే..!
ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు సిద్ధమవుతున్న టీడీపీ తాజాగా రాజమండ్రిలో నిర్వహించిన మహానాడులో మినీ మ్యానిఫెస్టో విడుదల చేసింది. ఇందులో పలు కీలక హామీలు ఇచ్చింది. వీటిపై అదే రోజు రాష్ట్రంలో చర్చ మొదలైపోయింది. ఇదే క్రమంలో అధికార వైసీపీ నేతలు విమర్శల దాడి మొదలుపెట్టేశారు. గతంలో చంద్రబాబు అమలు చేయని విషయాల్ని ఇప్పుడు మరోసారి జనానికి చెప్పి మభ్యపెడుతున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
టీడీపీ మినీ మ్యానిఫెస్టోపై ఆరోపణల్లో వైసీపీ నేతలందరి కంటే ఎంపీ విజయసాయిరెడ్డి ముందున్నారు. ఇలా మ్యానిఫెస్టో వచ్చిందో లేదో అలా విమర్శలు మొదలుపెట్టిన సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా రెచ్చిపోతున్నారు. దాదాపు ప్రతీ రోజూ మ్యానిఫెస్టోపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు గతాన్ని గుర్తుచేస్తూ సాయిరెడ్డి ట్వీట్లు చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీల అమలును ఇందులు గుర్తుచేస్తున్నారు.

తాజాగా సాయిరెడ్డి పెట్టిన ట్వీట్ లో చంద్రబాబు గతంలో రుణమాఫీ విషయంలో ఏం చేశారనే అంశాన్ని ప్రస్తావించారు. రుణమాఫీతో మొదలుపెట్టి డ్వాక్రా రుణాలు, కాల్ మనీ వరకూ సాయిరెడ్డి ట్వీట్ సాగింది. ఇందులో చంద్రబాబు, టీడీపీ గత ప్రభుత్వం వైఫల్యాల్ని సాయిరెడ్డి ప్రస్తావించారు. అలాంటి చరిత్ర ఉన్న వారు ఇప్పుడు మళ్లీ కొత్త హామీలు ఇవ్వడమేంటని సాయిరెడ్డి ట్వీట్లలో ప్రశ్నిస్తున్నారు.

సాయిరెడ్డి తన ట్వీట్ లో చంద్రబాబును ఉద్దేశించి.. రుణమాఫీ దేవుడెరుగు, డ్వాక్రా రుణాల వడ్డీ మాఫీలే ఎగ్గొట్టి కాల్ మనీ గ్యాంగ్స్ తో వేధించిన వాళ్లు. 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ 1500 ఇస్తారట. ఇది మోసఫెస్టో, మాయఫెస్టో కాదా అని సాయిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. తద్వారా గత టీడీపీ ప్రభుత్వంలో వైఫల్యాలను గుర్తుచేస్తూ ఇప్పుడు వాటిని కప్పిపుచ్చి కొత్త హామీలేంటనేది సాయిరెడ్డి అభ్యంతరంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications