ఏపీలో పెరిగిన జనం కొనుగోలు శక్తి-సాయిరెడ్డి లెక్క ఇదే- సంచలన ట్వీట్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. ప్రభుత్వం సంక్షేమం కోసం అప్పులు చేస్తుంటే ఈకలు పీకిన మీడియా సంస్ధలు.. ఇప్పుడు ఆర్దిక ప్రగతిపై లెక్కలు చేప్తుంటే మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో టీడీపీ అనుకూల పత్రికలన్నీ అప్పుల లెక్కలపై భూతద్దంతో సూక్ష్మ పరిశీలన జరిపాయని, కానీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించిన ఆర్థిక ప్రగతి వివరాలు ఈ మీడియాకు కనిపించలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. రుణభారంపై ముఖ్యమంత్రి చెప్పిన గణాంకాల్లో సత్యం తెలుసుకోవడానికి 'కోడిగుడ్డుపై ఈకలు లెక్కించే' ప్రక్రియకే ఈ పత్రికలు ప్రాధాన్యం ఇచ్చాయన్నారు. పేదల జీవన ప్రగతికి అత్యంత కీలకమైన వారి కొనుగోలు శక్తి పెరగడానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కాపు కాసే మీడియా అసలు చర్చించడానికే ఇష్టపడడం లేదని సాయిరెడ్డి ఆక్షేపించారు.

జనం కొనుగోలు శక్తి పెంచడం వల్ల జరిగిన మేలు గురించి అసెంబ్లీలో జగన్ చక్కగా వివరించారని విజయసాయిరెడ్డి కితాబిచ్చారు. పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి తగు మొత్తాల్లో నగదు బదిలీ చేయడం ద్వారా జగన్ సర్కారు ఎంతటి మేలు చేస్తోందో మాట్లాడడానికి పైన చెప్పిన పత్రికలు ముందుకు రావడం లేదన్నారు. వాటి దృష్టి అంతా రుణభారంపైనే అన్నారు. అమ్మ ఒడి, చేయూత, చేదోడు, ఆసరా వంటి నగదు సహాయ పథకాల ద్వారా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఇబ్బంది లేకుండా చూస్తోందన్నారు. తాను అధికారంలోకి వచ్చిన 9 నెలలకే కొవిడ్ మహమ్మారి ప్రజాజీవితాన్ని అతలాకుతలం చేసినా, ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా జనాన్ని ఆదుకుంది. ఆదాయమే లేని రోజుల్లో పేదల అకౌంట్లలో డబ్బు వేసి వారి కొనుగోలుశక్తిని పెంచిందన్నారు. పేదల సంక్షేమంలో ఇప్పుడు దేశంలో జగన్ ప్రభుత్వం తర్వాతే ఇంకెవరైనా అనే పేరు సంపాదించిందని సాయిరెడ్డి తెలిపారు.













Click it and Unblock the Notifications