భోగాపురానికి వైజాగ్ ఎయిర్ పోర్టు-విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు, విమర్శలతో వార్తల్లో నిలిచే వైసీపీ కీలక ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా విశాఖ ఎయిర్ పోర్టుపై సంచలన కామెంట్స్ చేశారు. విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విజయనగరం జిల్లాలోని భోగాపురానికి తరలిస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ ఆధీనంలో ఉంది. మరోవైపు వైసీపీ సర్కార్ విజయనగరం జిల్లా భోగాపురంలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తోంది. ఇప్పటికే భూసేకరణతో పాటు ఇతర పనులు పూర్తి చేసుకున్న ఈ విమానాశ్రయం నిర్మాణం త్వరలో పూర్తిస్ధాయిలో ప్రారంభం కానుంది. ఈ ఎయిర్ పోర్టు నిర్మాణం 2023లో పూర్తి కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురానికి తరలిస్తామని ప్రకటన చేశారు. దీంతో విశాఖ, భోగాపురంలలో రెండు ఎయిర్ పోర్టులు ఉండబోవటం లేదని తేలిపోయింది.
ప్రస్తుతం రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న విశాఖ ఎయిర్ పోర్టును భోగాపురానికి తరలించడం ద్వారా విశాఖ విమానాశ్రయాన్ని కేవలం రక్షణ అవసరాలకు పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో భోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధి ద్వారా ఉత్తరాంద్రలోని మిగిలిన రెండు జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ ఆలోచననే విజయసాయిరెడ్డి ఇప్పుడు బయటపెట్టారా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే విశాఖకు రాజధాని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం భోగాపురం ఎయిర్ పోర్టు ద్వారా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది.
మరోవైపు విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఎంపిక చేసిన ప్రభుత్వం... దీన్ని మిగిలిన జిల్లాలతో కనెక్ట్ చేసే పనిలో బిజీగా ఉంది. ఇందులో భాగెంగా విశాఖను సైతం భోగాపురం ఎయిర్ పోర్టుకు కనెక్ట్ చేసేలా రహదారి పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. అదే సమయంలో విశాఖలో మురికివాడల్ని సైతం అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సాయిరెడ్డి వెల్లడించారు. విశాఖ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.