వైఎస్ జగన్ మిస్సింగ్: చంద్రబాబుకు వైసీపీ రూ.1,600 కోట్ల ఆఫర్: వైసీపీ, టీడీపీ టైమ్పాస్
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ రాష్ట్రాన్ని అల్లకల్లోలానికి గురి చేస్తోంది. రోజూ పదుల సంఖ్యలో జనం ప్రాణాలను కోల్పోతున్నారు. వేల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తోన్నాయి. ఆక్సిజన్,వ్యాక్సిన్ కొరత రాష్ట్రాన్ని వెంటాడుతోంది. ఆసుపత్రుల్లో పడకలు ఆశించిన స్థాయిలో అందుబాటులో ఉండట్లేదు. 19 లక్షలకు పైగా ఉన్న కరోనా యాక్టివ్ పేషెంట్లకు చికిత్స అందించడానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం పలు జిల్లాల్లోని గోడౌన్లు, గురుకుల పాఠశాలలు, ఇంజినీరింగ్ కాలేజీలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చింది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించడానికి కొత్త ప్రయత్నాలను మొదలు పెట్టింది.
Recommended Video
టైమ్ పాస్ రాజకీయాలతో..
ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం టైమ్ పాస్ రాజకీయాలకు తెర తీసినట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనిపించట్లేదంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన సోషల్ మీడియా పోస్టింగ్కు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కనిపించట్లేదంటూ ఎదురుదాడికి దిగింది. సంక్షోభ పరిస్థితులు చుట్టుముట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటూ రాజకీయాలు దిగడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టీడీపీ స్టార్ట్ చేస్తే..
ముఖ్యమంత్రి కనిపించట్లేదంటూ తొలుత నారా లోకేష్ తన అధికారిక ట్విట్టర్ మీడియా అకౌంట్లో ఆదివారం రాత్రి ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని మీరు గుర్తు పట్టారా? అంటూ ప్రశ్నించారు. వైఎస్ జగన్ను చెవిటివాడిగా, జైలు పక్షిగా అభివర్ణించారు. చివరిసారిగా తాడేపల్లి ప్యాలెస్లో కనిపించాడని ఈ ఫొటోపై ముద్రించారు. తాను ఉన్నానని జనానికి భరోసా ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత కనిపించకుండా పోయాడని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను విన్నానని అరిచి చెప్పిన జగన్ రెడ్డి, రాష్ట్రంలో కరోనాతో మరణిస్తున్న వారి ఆర్తనాదాలు వినిపించుకోవడం లేదంటూ మండిపడ్డారు.
వైసీపీ కౌంటర్..
దీనికి వైఎస్సార్సీపీ ఎదురుదాడికి దిగింది. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ అదృశ్యం అయ్యారంటూ కౌంటర్ ఇచ్చింది. వారిద్దరూ రాష్ట్రాన్ని విడిచి వెళ్లారని పేర్కొంది. చివరిసారిగా ఏపీలో తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచారంలో కనిపించారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వీ వీజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. అనంతరం మూడు రోజుల కిందట జూమ్లో కనిపించారని, మళ్లీ అంతర్థానం అయ్యారని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై విష ప్రచారం చేసిన అనంతరం వారిద్దరూ అదృశ్యమయ్యారని చెప్పారు.

1600 కోట్లు ఆఫర్
కరోనా వైరస్ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్ను కొనుగోలు చేయడానికి కావాల్సిన 1,600 కోట్ల రూపాయలతో పాటు కమీషన్ కూడా చంద్రబాబు, నారా లోకేష్ చేతికే ఇస్తామని సాయిరెడ్డి బపర్ ఆఫర్ ఇచ్చారు. చంద్రబాబు తన బంధువులకు చెందిన కంపెనీలతో మాట్లాడి వ్యాక్సిన్ ఇప్పించాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, నారా లోకేష్ కోసం అటు రాష్ట్ర ప్రజలు, కుప్పం ఓటర్లు ఎదురు చూస్తున్నారంటూ చురకలు అంటించారు. బాధ్యత గల ప్రతిపక్ష నేత పొరుగు రాష్ట్రంలో దాక్కున్నాడని, అలాంటి నాయకుడి నుంచి సలహాలను కూడా ఆశించడం అత్యాశే అవుతుందని వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు.












Click it and Unblock the Notifications