గడ్కరీకి విజయసాయిరెడ్డి కీలక సలహా-120 కి.మీ స్పీడ్ లిమిట్-4 ఎయిర్ బ్యాగ్ లు
నిత్యం ఏదో ఒక ట్వీట్ తో వార్తల్లో నిలిచే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఓ ట్వీట్ పెట్టారు. అయితే ఇది ఏదో విమర్శలో, ప్రతి విమర్శలతో కూడినదో కాదు. ఓ కీలక సలహా ఇస్తూ సాయిరెడ్డి ఈ ట్వీట్ చేశారు. దీంతో విజయసాయిరెడ్డి ట్వీట్ వైరల్ అవుతోంది.
కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ దేశంలో పెరిగిపోతున్న కారు ప్రమాదాల నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ దుర్మరణం పాలైన నేపథ్యంలో రోడ్డు కాంట్రాక్టర్లపై ఆగ్రహంగా ఉన్న గడ్కరీ వారిని నియంత్రించడంతో పాటు ప్రమాదాలు జరగకుండా పలు కీలక చర్యలుతీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయనకు పలుసూచనలు చేస్తూ ఓ ట్వీట్ పెట్టారు.
గడ్కరీని ట్యాగ్ చేస్తూ పెట్టిన ట్వీట్ లో వైసీపీ ఎంపీ సాయిరెడ్డి పలు సూచనలు చేశారు. కారు ప్రమాదాల్లో ఏటా లక్షన్నర మంది చనిపోతున్నారని సాయిరెడ్డి గుర్తుచేశారు. వీటిని అరికట్టేందుకు అమ్మే ప్రతీకారులోనూ నాలుగు ఎయిర్ బ్యాగ్ లు ఉండేలా చూడాలన్నారు. అలాగే కార్ల వేగాన్ని 120 కిలోమీటర్లకు పరిమితం చేయాలని కూడా సాయిరెడ్డి గడ్కరీని కోరారు. అదే విధంగా కార్లు, బస్సుల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని కూడా సాయిరెడ్డి కోరారు. దీనిపై గడ్కరీ ఇంకా స్పందించాల్సి ఉంది.