కడప ఎంపీగా జగన్ పోటీపై తేల్చేసిన వైవీ సుబ్బారెడ్డి-కీలక వ్యాఖ్యలు..!
ఏపీలో గత కొన్ని రోజులుగా కడప ఉప ఎన్నికపై ప్రచారం జరుగుతోంది. పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్.. త్వరలో ఆ స్ధానానికి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారనేది ఈ ప్రచారం సారాంశం. ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఆ సీటులో తాను పోటీ చేసేందుకు జగన్ సిద్దమవుతున్నారని టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇదే అంశాన్ని తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించడంతో దీనిపై వైసీపీ స్పందించింది.
పులివెందుల ఎమ్మెల్యే సీటుకు వైఎస్ జగన్ రాజీనామా చేసి కడప లోక్ సభకు పోటీ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై పార్టీ ఎంపీ, జగన్ బాబాయ్ కూడా అయిన వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఇదంతా దుష్ప్రచారమే అన్నారు. జగన్ రాజీనామా చేయరని, చేయాల్సిన అవసరం కూడా లేదని ఆయన తేల్చిచెప్పేశారు. అదంతా టీడీపీ చేస్తున్న ప్రచారమే అన్న వైవీ.. దీన్ని ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే రావడంతో అసెంబ్లీకి రాలేని పరిస్ధితి జగన్ కు ఎదురవుతోంది. విపక్ష నేత హోదా కోసం స్పీకర్ కు జగన్ చేసిన విజ్ఞప్తిని కూడా పట్టించుకునే అవకాశం కనిపించకపోవడంతో ఇక ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్ కు వెళ్తారన్న ప్రచారం జరిగింది. అయితే నిన్న కడప వైసీపీ అధ్యక్షుడు సురేశ్ బాబు, ఇవాల ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా దీన్ని ఖండించడంతో అదంతా ఒట్టిదేనని తేలిపోయింది.












Click it and Unblock the Notifications