చంద్రబాబును కలిసిన వైసీపీ ఎంపీపీ
అభివృద్ధి చేయడానికి నిధులున్నప్పటికీ పనులు జరగకుండా సొంత పార్టీ నేతలే అడ్డుకుంటున్నారని పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస వైసీపీ ఎంపీపీ బొంగు సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏమీ చెప్పలేకపోతున్నానన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును బొబ్బిలిలో కలిశారు. కురుపాం నియోజకవర్గంలో నెలకొన్న అవినీతి, అక్రమాలను బాబు దృష్టికి తీసుకెళ్లానని, చంద్రబాబు మన్యం పర్యటనకు వచ్చినప్పుడు తమ శ్రేణులతో మాట్లాడి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.
చంద్రబాబునాయుడు ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోని రాజాం, బొబ్బిలి తదితర నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. వైసీపీ నిధులను దుర్వినియోగం చేస్తోందని, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి దోచుకుంటున్నారని, ముఖ్యమంత్రి జగన్ కొట్టేసిన భూముల విలువ రూ.40వేల కోట్లు అంటూ చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఆరోపణలను జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి ఏం దోచుకున్నారో, ఏం ఆక్రమించుకున్నారో చెప్పాలని బాబుకు సవాల్ విసిరారు. విజయనగరం జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదని, వైఎస్ వచ్చిన తర్వాత తోటపల్లి పూర్తయిందని గుర్తుచేశారు. తమ శాఖలపై విజయసాయి, సుబ్బారెడ్డి స్వారీ చేయడానికి మేమేమన్నా చిన్న పిల్లలమా? అని బొత్స ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి పోటీగా తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాకు రూపకల్పన చేసింది. జిల్లాలవారీగా చంద్రబాబు పర్యటిస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జిలను, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు.