రాజ్యసభలో వైసీపీ పోరు-రఘురామ, పోలవరం నిధులపై చర్చకు నోటీసులు
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వైసీపీ ఎంపీల పోరాటం కొనసాగుతోంది. ఇవాళ రాజ్యసభలో రెండు కీలకమైన అంశాలపై చర్చ కోరుతూ వైసీపీ ఎంపీలు నోటీసులు ఇచ్చారు. వీటిపై చర్చకు అనుమతించాలని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడిను వారు కోరారు. దీనిపై రాజ్యసభ ఛైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
రాజ్యసభలో పోలవరం, పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్చకు వైయస్ఆర్సీపీ ఎంపీలు నోటీసులు ఇచ్చారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు, సవరించిన అంచనాల ప్రకారం పోలవరం నిధులు విడుదలలో జాప్యంపై చర్చకు అనుమతించాలని రూల్ 267 కింద పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రెడ్డి నోటీసు ఇచ్చారు. అలాగే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ను అనుసరించి.. పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్చకు అనుమతించాలని రూల్ 267 క్రింద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.నోటీసు ఇచ్చారు.
తమ పార్టీకే చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీ విధానాల్ని వ్యతిరేకిస్తున్నారు. లోక్ సభ స్పీకర్ కు ఇప్పటికే వైసీపీ ఎంపీలు ఆయనపై వేటు కోసం ఫిర్యాదు కూడా చేశారు. పార్లమెంటు సచివాలయం నుంచి ఆయనకు నోటీసులు కూడా వెళ్లాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో పార్టీ ఫిరాయింపులపై వైసీపీ చర్చ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
లోక్ సభ స్పీకర్ పై ఒత్తిడి పెంచేందుకు వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పోలవరం నిధులపై సీఎం జగన్ ఎన్నిసార్లు ఢిల్లీ పెద్దల్ని కలిసి విజ్ఞప్తి చేసినా నిధులు మాత్రం విడుదల కావడం లేదు. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వైసీపీ ఎంపీలు రాజ్యసభలో చర్చ కోరుతున్నారు.