కెసిఆర్ ఫార్మూలా: ఎంపీలతో రాజీనామా వెనుక జగన్ ప్లాన్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపిని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ రాజీనామాల అస్త్రాన్ని ఎంచుకోనున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపిని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ రాజీనామాల అస్త్రాన్ని ఎంచుకోనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై వైసీపీ ఎంపీలతో రాజీనామాలను చివరి అస్త్రంగా వైసీపీ ప్రయోగించనుంది. తెలంగాణలో కెసిఆర్ అనుసరించిన ఫార్మూలాను జగన్ అనుసరించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
బాబుకు షాక్: పాదయాత్రకు బ్రేక్ పడకుండా జగన్ ప్లాన్ ఇదే!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్రప్రాంతాల్లో రాజీనామా అస్త్రాలతో టిఆర్ఎస్, వైసీపీలు రాజకీయంగా టిడిపి, కాంగ్రెస్ను ఇబ్బందిపెట్టాయి.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో టిఆర్ఎస్, వైసీపీకి రాజీనామా అస్త్రాలు రాజకీయంగా ఉపయోగపడ్డాయి. రాజకీయంగా ప్రత్యర్థులపై ఈ రెండు పార్టీలు బలపడ్డాయి.ప్రత్యర్థులను మరింత బలహీనపడేలా చేశాయి.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు విడిపోయాయి. అయితే ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సెంటిమెంట్ను సజీవంగా ఉంచేందుకు కెసిఆర్ అనుసరించిన ఫార్మూలానే వైసీపీ చీఫ్ జగన్ అనుసరించనున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేక హోదాపై ఎంపీలతో వైసీపీ రాజీనామా
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని హమీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో టిడిపి- బిజెపి కూటమి కూడ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని ప్రకటించాయి.అయితే పలు కారణాలతో ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది కేంద్రప్రభుత్వం. అయితే ప్రత్యేక ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీలోని ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొని వైసీపీ కాలేజీల్లో యువభేరీ సభలు నిర్వహించింది. వైసీపీ చీఫ్ జగన్ దీక్ష నిర్వహించారు. చివరిగా తమ పార్టీకి చెందిన ఎంపీలతో జగన్ రాజీనామాలు చేయించనున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గరపడే లోపుగా రాజీనామాల అస్త్రాన్ని వైసీపీ తెరమీదికి తెచ్చే అవకాశం ఉంది.
కెసిఆర్ అనుసరించిన ఫార్మూలాలోనే జగన్
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచేందుకు ఉప ఎన్నికల అస్త్రాన్ని కెసిఆర్ ఎంచుకొన్నారు. ఇతర పార్టీల నుండి టిఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ అభ్యర్థులుగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఈ ఫార్మూలాతో కెసిఆర్ తన ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకొన్నారు. దీనికితోడు తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ప్రజల మధ్య చర్చ జరిగేలా చేశారు. ఏపీలో కూడ తెలంగాణలో కెసిఆర్ అనుసరించిన ఫార్మూలాను అనుసరించనున్నారు.
ప్రత్యేక హోదా అంశంపై
ఏపీలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల మద్య సజీవంగా ఉండేలా వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చర్యలు తీసుకొంటున్నారు. యువభేరీ సదస్సుల ద్వారా వైసీపీ ప్రత్యేక హోదాపై చర్చ కొనసాగిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ప్రత్యేక హోదాతో ఏ రకమైన ప్రయోజనాలుంటాయి, ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రానికి నష్టాలేమిటీ, ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు ఒనగూరిన నష్టాలపై వైసీపీ చీఫ్ జగన్ ప్రచారం చేస్తున్నారు.పాదయాత్రలో ఈ అంశాలను ప్రధానంగా ప్రస్తావించే అవకాశాలున్నాయి. రాజకీయంగా తనకు అనుకూలమైన వాతావరణం చూసుకొని ఎంపీలతో రాజీనామా అస్త్రాన్ని జగన్ ప్రయోగించే అవకాశం ఉంది.దీంతో రాజకీయంగా టిడిపిని ఇరుకునపెట్టాలని వైసీపీ భావిస్తోంది.
వైసీపీకి ధీటుగా టిడిపి వ్యూహం
ప్రత్యేక హోదాపై తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని ప్రకటించిన వైసీపీ చీఫ్ జగన్ ఎందుకు తమ పార్టీకి చెందిన ఎంపీలతో రాజీనామాలు చేయించడం లేదని టిడిపి ప్రశ్నిస్తోంది. ప్రత్యేక హోదా అంశం సున్నితమైంది. అయితే ఈ విషయమై రాజకీయంగా తమను ఇబ్బందిపెట్టేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలను టిడిపి గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఇంకా వైసీపీ ఎంపీలు ఎందుకు రాజీనామాలు చేయలదేని టిడిపి ప్రశ్నిస్తోంది.మోడీతో కాళ్ళబేరాలు ఆడుతూ ఏపీలో ప్రత్యేక హోదాపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు.బిజెపితో వైసీపీ సన్నిహితంగా మెలుగుతున్న అంశాలపై టిడిపి వైసీపీపై ప్రశ్నలు సంధిస్తోంది.