నెల్లూరులో వైసీపీ కౌన్సిలర్ దారుణ హత్య... పుట్టినరోజు నాడే కిరాతకంగా చంపేశారు...
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. సూళ్లూరుపేటలో పట్టపగలు వైసీపీ కౌన్సిలర్ తాళూరు సురేశ్(40) దారుణ హత్యకు గురయ్యారు. కారు పార్క్ చేస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయనపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. పుట్టినరోజు నాడే సురేష్ హత్యకు గురవడం గమనార్హం.
సోమవారం(అగస్టు 9) సురేష్ పుట్టినరోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దైవ దర్శనం కోసం వెళ్లారు. అనంతరం సాయంత్రం సమయంలో తిరిగి సూళ్లూరుపేటకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఇంటి వద్ద దింపిన సురేష్.. సమీపంలోని రైల్వే కేబిన్ రోడ్డులో కారును పార్క్ చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో గుర్తు తెలియని అగంతకులు కత్తులతో ఆయనపై దాడికి తెగబడ్డారు.

చాలాసేపటి వరకు సురేష్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. పార్కింగ్ ప్రదేశానికి వెళ్లి చూడగా సురేష్ రక్తపు మడుగులో పడి కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే కీలక ఆధారాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పక్కా ప్లాన్తోనే సురేష్ను హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సురేష్ హత్యను స్థానిక వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించినట్లు తెలుస్తోంది.
గత నెలలో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ సర్పంచ్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. లింగాల మండలం కోమనూతల గ్రామ సర్పంచ్ మునెప్ప(50)ను ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేశారు. మునెప్ప కదలికలపై నిఘా పెట్టిన ప్రత్యర్థులు కాపు గాసి ఒక్కసారిగా అతనిపై దాడి చేసి హతమార్చారు.
ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో మునెప్ప 150 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. మంగళవారం(జులై 27) పులివెందులలో సర్పంచ్ల శిక్షణా తరగతులకు హాజరై తిరిగొస్తున్న క్రమంలో ప్రత్యర్థులు అతని బైక్ను అడ్డగించారు. ఆపై వేట కొడవళ్లతో నడిరోడ్డు పైనే ఆయన్ను దారుణంగా హతమార్చారు. గ్రామంలో ఆధిపత్య పోరు,పాతకక్షలే హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications