జ్యోతిష్యుల సూచనతో యాత్ర తేది మార్పు, కీలక నేతలతో జగన్ సమావేశం
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రను అస్త్రంగా ఎంచుకొన్నారు.
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రను అస్త్రంగా ఎంచుకొన్నారు. అంతేకాదు తాము అధికారంలోకి వస్తే అమలు చేసే నవరత్నాల హమీపై ప్రజల్లో అవగాహన కల్పించేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు.ప్రతి శుక్రవారం నాడు సిబిఐ కోర్టుకు హజరుకావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో పాదయాత్రను వారంలో ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై పార్టీలో చర్చ సాగుతోంది.
Recommended Video
వైఎస్ జగన్: నవంబర్ 6 నుండి పాదయాత్ర, 2 రోజుల ముందే తిరుపతికి
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రకు అన్ని అడ్డంకులే ఏర్పడుతున్నాయి. పాదయాత్ర తేదీలను రెండు దఫాలు మార్పులు చేశారు. అయితే ఈ మార్పుకు కూడ కారణాలున్నాయంటున్నారు వైసీపీ నేతలు.
పాదయాత్రను దృష్టిలో ఉంచుకొని ప్రతి శుక్రవారం కోర్టుకు హజరయ్యే విషయమై మినహయింపు ఇవ్వాలని సిబిఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో ప్రతి శుక్రవారం నాడు కోర్టుకు హజరుకావాల్సిన అనివార్య పరిస్థితులు జగన్కు నెలకొన్నాయి.దీంతో పాదయాత్ర షెడ్యూల్లో మార్పులు చేర్పులు చేశారు.
జ్యోతిష్యుల సూచన మేరకే పాదయాత్ర తేది మార్పు
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అక్టోబర్ 27వ, తేది నుండి పాదయాత్ర చేయాలని తొలుత భావించారు. ఈ మేరకు వైసీపీ కూడ ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే పాదయాత్ర తేదీని మార్చారు.అక్టోబర్ 27వ, తేది మంచి రోజు కాదని జ్యోతిష్కులు సూచించడంతో నవంబరు 2కు పాదయాత్రను వాయిదావేసుకున్నారు.అయితే సిబిఐ కోర్టులో జగన్కు వ్యతిరేకంగా తీర్పు రావడంతో నవంబర్ 2వ, తేది నుండి కాకుండా నవంబర్ 6వ, తేది నుండి పాదయాత్రను నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. నవంబర్ 2వ, తేది గురువారం. మరునాడే కోర్టుకు జగన్ హజరుకావాల్సి ఉంది. అయితే పాదయాత్ర ప్రారంభించిన మరునాడే బ్రేక్ వేయాల్సి వస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని భావించి నవంబర్ 6వ, తేదికి పాదయాత్రను మార్చాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు.
వారంలో ఎన్ని రోజుల పాటు పాదయాత్ర?
నవంబరు 6 నుంచి పాదయాత్ర ఆరంభించాక.. వారంలో ఎన్ని రోజులు చేపట్టాలన్న అంశంపై జగన్ అత్యంత సన్నిహిత వర్గాలతో మంతనాలు జరిపారనే ప్రచారం సాగుతోంది. కోర్టు కేసు కారణంగా వారంలో ఎన్ని రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాలనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వారంలో 6 రోజులపాటు యాత్ర చేయాలా, ఐదురోజులా అనే విషయమై పార్టీ నేతలతో జగన్ చర్చించారనే ప్రచారం సాగుతోంది. ఎన్ని రోజులు పాదయాత్ర నిర్వహిస్తే ప్రయోజనంగా ఉంటుందనే విషయమై కూడ చర్చించారంటున్నారు. ఈ నెల 26వ, తేదిన జరిగే పార్టీ శాసనసభపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుందంటున్నారు నేతలు.
బ్రేక్ పడకుండా ప్రత్యామ్యాయ ఏర్పాట్లు
ప్రతి శుక్రవారం నాడు కోర్టుకు హజరుకావాల్సిన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాదయాత్రకు బ్రేక్ పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వైసీపీ నాయకత్వం చేస్తోంది. శుక్రవారం నాడు పార్టీ సిబిఐ కోర్టుకు హజరుకావాల్సి ఉన్నందున గురువారం సాయంత్రం లేదా శుక్రవారం ఉదయమే ప్రత్యేక విమానంలో హైద్రాబాద్కు వచ్చేలా వైఎస్ జగన్ ప్లాన్ చేస్తున్నారు. హైద్రాబాద్కు సమీపంలో పాదయాత్ర సాగుతున్న సమయంలో రోడ్డు మార్గం ద్వారా కూడ హైద్రాబాద్కు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
అక్టోబర్ 26న, వైసీపీ విస్తృత స్థాయి సమావేశం
వైసీపీ విస్తృతస్థాయి సమావేశం అక్టోబర్ 26వ, తేదిన నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పాదయాత్రపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పాదయాత్ర ఎలా కొనసాగాలి, ఏఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావించాలి, కోర్టుకు హజరైన తర్వాత పాదయాత్ర ఎలా ప్రారంభించాలి, కోర్టుకు హజరయ్యేందుకు ఏర్పాట్లు ఎలా చేపట్టాలనే దానిపై ఈ సమావేశంలో కూలకంశంగా చర్చించే అవకాశం ఉంది. పార్టీ శాసనసభపక్ష సమావేశం కూడ అక్టోబర్ 26వ, తేదినే నిర్వహించనున్నారు.