ఆ ఒక్కటి... వైఎస్ జగన్ కు చెమటలు పట్టిస్తోంది!!
ఆ నియోజకవర్గంలో రోజురోజుకు సమస్యలు పెరుగుతున్నాయేకానీ తగ్గడంలేదు. తగ్గే సూచనలు దరిదాపుల్లో కూడా కనపడటంలేదు. దీంతో ఈ నియోజకవర్గమంటేనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తలనొప్పి వస్తోంది. ఎందుకంటే అక్కడున్న నేతల్లో జగన్ ఎవ్వరినీ కాదనలేకపోతున్నారు. ముగ్గురు కీలక నేతలున్నారు. అలాగే మూడు గ్రూపులున్నాయి. ఎవరికి వారే నియోజకవర్గ టికెట్ తమకే అని చెప్పుకుంటున్నారు.. ప్రచారం చేసుకుంటున్నారు.

సీటు కోసం ముగ్గురు నేతల విశ్వప్రయత్నం
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గం వైసీపీ అధిష్టానానికి సరికొత్త తలనొప్పులు తెస్తోంది. పార్టీ అధినాయకత్వాన్ని పట్టించుకోకుండా ఇక్కడున్న ముగ్గురు నేతలు తమను తాము బలోపేతం చేసుకోవడంతోపాటు సీటుకోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గత ఎన్నికల్లో బలరాంపై ఓటమిపాలైన ఆమంచి కృష్ణమోహన్ తోపాటు ఎమ్మెల్సీ పోతుల సునీత ఉన్నారు. చీరాల టికెట్ కోసం ఈ ముగ్గురు నేతలు తీవ్రంగా పోటీపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై తన కుమారుడు కరణం వెంకటేష్ ను పోటీచేయించాలనే యోచనలో బలరాం ఉన్నారు.

అయోమయానికి గురవుతున్న శ్రేణులు
చీరాల అంటే సహజంగానే ఆమంచి కృష్ణమోహన్ పేరు చెబుతారు. నియోజకవర్గంలో గట్టి పట్టుంది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. 2014లో నవోదయ పార్టీనిపెట్టుకొని స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోచేరి ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి పార్టీకి నియోజకవర్గ ఇన్ ఛార్జిగా కొనసాగుతున్నారు. టీడీపీ నుంచి విజయం సాధించిన బలరాం వైసీపీ మద్దతుదారుగా మారడంతో ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది. ఇక్కడ ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన పోతుల సునీతకు జగన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి పోటీకి దిగాలని పోతుల సునీత ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తాను చీరాల నుంచి పోటీచేయబోతున్నట్లు కరణం వెంకటేష్ ప్రకటించారు. నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఈ ముగ్గురు నేతలు వేర్వేరుగా చేపడుతున్నారు. దీంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి.

పర్చూరుకు వెళ్లనంటున్న ఆమంచి?
సమస్య పరిష్కారం కోసం ఆమంచిని పర్చూరు ఇన్ చార్జిగా నియమించారు. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న రామనాథం బాబును ఆమంచితో కలిసి పనిచేయమంటూ జగన్ సూచించారు. అయితే పర్చూరు వెళ్లేందుకు కృష్ణమూర్తి సుముఖంగా లేరు. అవసరమైతే తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతాననని, తనకు చీరాలలోనే బలం ఉందని సన్నిహితుల దగ్గర ఆమంచి వ్యాఖ్యానిస్తున్నారు. చీరాలలో పద్మశాలి, బలిజ సామాజికవర్గ ప్రాబల్యం ఎక్కువ. ఈ రెండు సామాజికవర్గాలు ఎవరివైపు మొగ్గుచూపితే వారికే గెలుపు దక్కుతుంది. ఈ నేతలంతా కలిసి పనిచేసే వైసీపీకే విజయం దక్కుతుంది. తనకు టికెట్ దక్కకపోతే పార్టీని వీడేందుకు కూడా ఆమంచి వెనుకాడరు. అద్దంకి నుంచి పోటీచేస్తాడని భావించిన కరణం వెంకటేష్ తాను చీరాల నుంచే పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. రాజకీయంగా అనేకమలుపులకు కారణమవుతున్న చీరాల నియోజకవర్గం ఏ దరికి చేరుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications