గడపగడపకు వైసీపీ: పూతలపట్టు ఎమ్మెల్యే కారుని ఢీ కొన్న మరో కారు
అమరావతి: చిత్తూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్కు బుధవారం తృటిలో పెనుప్రమాదం తప్పింది. కాణిపాకంలో వైసీపీ బుధవారం నిర్వహించ తలపెట్టిన గడపగడపకు వెఎస్సార్ కార్యక్రమానికి పాల్గొనేందుకు ఆయన వాహనంలో వెళ్తున్నారు.
ఈ క్రమంలో ఎదురుగా వస్తోన్న ఇన్నోవా కారు ఎమ్మెల్యే సునీల్ ప్రయాణిస్తోన్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ప్రమాదంలో సునీల్ ప్రయాణిస్తోన్న కారు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
అనంతరం సునీల్ కుమార్ మరో కారులో కాణిపాకం బయల్దేరి వెళ్లారు. ప్రమాదం నుంచి ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడడంతో వైసీపీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వాహనం బోల్తా పడి 30 మంది కూలీలకు గాయాలు
చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లానూరు గ్రామం వద్ద బుధవారం బొలేరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ఉపాధి కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను మల్లానూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
గాయపడిన వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వాహనం అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.