నారాసుర పాలన అంతమైనట్టే: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన ఓటర్లకు వందనం: విజయసాయిరెడ్డి
అమరావతి: రాష్ట్రంలో గురువారం జరిగిన పోలింగ్ తీరుతెన్నులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యానాలు చేశారు. నారాసుర పాలన నుంచి రాష్ట్రం విముక్తి పొందిందని, ప్రజలు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. సజావుగా కొనసాగుతున్న పోలింగ్ ను అడ్డుకోవడానికి చంద్రబాబు తన రౌడీ మూకలను ఉసిగొల్పినప్పటికీ..ఓటర్లు ప్రజాస్వామ్యానికి రక్షణ వలయంగా నిలిచారని చెప్పారు. ఈ మేరకు ఆయన వరుసగా ట్వీట్లు సంధించారు.
టీడిపి గూండాల దౌర్జన్యాలు, కులమీడియా బెదరగొట్టే వార్తలను పట్టించుకోకుండా జనం సునామీలా మారారని, ఉప్పెనలా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నిలిచారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి, రాక్షస పాలనను అంతం చేయడానికి ప్రజానీకం చూపిన చొరవకు తాను శిరసు వంచి వందనం చేస్తున్నానని అన్నారు. రాష్ట్ర చరిత్రలో మరో సువర్ణాధ్యాయం మొదలైందని అన్నారు.
నియంతలు పాలించిన దేశాల్లో కూడా ఎన్నికల్లో ఇన్ని అరాచకాలు జరిగి ఉండవని విజయసాయి రెడ్డి విమర్శించారు. చంద్రబాబు తాను మరోసారి అధికారంలోకి రావడానికి వేల కోట్ల రూపాయలను వెద జల్లారని అన్నారు. తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున మద్యాన్ని తెప్పించి, రాష్ట్రంలో పంచారని అన్నారు. తమ పార్టీ సానుభూతి పరుల ఇళ్లకు మంచి నీళ్లు వెళ్లకుండా పైపులైన్లను ధ్వంసం చేశారని, అయినప్పటికీ ప్రజా ప్రభంజనాన్ని చంద్రబాబు అడ్డుకోలేకపోయారని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ ప్రతి నియోజక వర్గంలో దౌర్జన్యాలకు పాల్పడిందని చెప్పారు. తమ కార్యకర్తలు సంయమనం పాటించారని ప్రశంసించారు. నీచపు పనులన్నీ చేసి పత్తిత్తులాగా చంద్రబాబు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారాన్ని కోల్పోయిన వెంటనే తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో రౌడీలా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.