నా మీద నాకే అసహ్యంగా ఉంది- రఘురామ సంచలనం..!!
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పోలీస్ డైరెక్టర్ జనరల్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిపై ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై తనకు ఉన్న అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను రఘురామ కృష్ణంరాజు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు.
శాడిజం పెరిగిపోయింది.
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పొలిట్ బ్యురో సభ్యుడు వర్ల రామయ్యకు లేఖ రాయడాన్ని రఘురామ కృష్ణంరాజు తప్పుపట్టారు. నారా లోకేష్ నిర్వహించ తలపెట్టిన యువ గళం పాదయాత్రలో పాల్గొనే వారి వివరాలు, వాహనాలు, ఏ రోజు ఏ గ్రామంలో పర్యటిస్తారో తెలియజేయాలంటూ లేఖ రాయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక దశలో బుద్ధుందా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల్లో శాడిజం పెరిగిపోయిందని మండిపడ్డారు. నంబర్ 1 సినిమాలో విలన్ క్యారెక్టర్ ను మించిపోయారని ఎద్దేవా చేశారు.
ఎందుకిలా చేస్తున్నారు?
నారా లోకేష్ యువగళం పాదయాత్రను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రఘురామ ఆరోపించారు. ప్రభుత్వం ఎందుకిలా చేస్తోందనేది అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. నారా లోకేష్ తెలుగులో అనర్గళంగా మాట్లాడుతున్నారని, అదే ఊపుతో జనంలోకి వెళ్తే ఆయనకు ఆదరణ వస్తుందనే భయం తమ పార్టీ నాయకుల్లో వ్యక్తమౌతోందని అన్నారు. నారా లోకేష్ ను చూసి తమ పార్టీ నాయకులకు గుండెల్లో బేజారెత్తిపోతోందని అన్నారు.
ఎవరు వస్తారని ఎలా చెప్పగలుగుతారు?
వైఎస్ జగన్ ఇంత నిరంకుశత్వంగా ఎలా వ్యవహరించగలుగుతున్నారని రఘురామ ప్రశ్నించారు. 400 రోజుల పాటు సాగే నారా లోకేష్ యువ గళం పాదయాత్రకు ఎవరు వస్తారు? ఎలా వస్తారు? ఏ వాహనంలో వస్తారనే వివరాలను ఎలా ఇవ్వగలుగుతారని అన్నారు. ఐపీఎస్ ఎలా పాసయ్యాడంటూ ఏపీ డీజీపీని ఉద్దేశించి విమర్శించారు. ఇలాంటి పరిణామాలు ఏపీలో తలెత్తడం అత్యంత దురదృష్టకరమని రఘురామ అన్నారు. విలనిజం, సైకోయిజం, శాడిజాన్ని ఎలా ప్రదర్శించగలుగుతున్నారని చెప్పారు.
వారాహి చక్రాల కింద..
పోలీస్ వ్యవస్థ లాగా ప్రభుత్వం చెప్పిందే చేసేంత నీచస్థితికి మిగిలిన వ్యవస్థలు దిగజారలేదని తాను నమ్ముతున్నట్లు రఘురామ అన్నారు. ఇదివరకు అయ్యన్నపాత్రుడు తమను విమర్శించినందుకు పోలీసులు ఆయనపై అలిగారని, ఇప్పుడు నారా లోకేష్ రోడ్డెక్కతుంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. త్వరలో పవన్ కల్యాణ్ వారాహి బస్సు యాత్ర కూడా మొదలైతే దాని చక్రాల కింద నలిగిపోతారని హెచ్చరించారు. ఇలాంటి వ్యవస్థలో ఉన్నందుకు తన మీద తనకే అసహ్యంగా ఉందని రఘురామ చెప్పారు.
27న ప్రారంభం అయ్యే పాదయాత్ర..
ఈ నెల 27వ తేదీన ప్రారంభం అయ్యే నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిరాటంకంగా సాగాలని తాను కోరుకుంటున్నట్లు రఘురామ చెప్పారు. జగన్ ప్రభుత్వ ఆగడాలకు ఈ పాదయాత్ర అడ్డుకుంటుందని ఆశిస్తున్నానని అన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజలను నేరుగా కలుసుకోలేని వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉందని, దీన్ని లోకేష్ తుడిచిపెడతారని చెప్పారు. ఆయనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.