జగన్ లాయర్ తో చిరు వస్తే కానీ- రఘురామ సంచలనం-భేటీ శుభపరిణామమంటూనే
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం మెగాస్టార్ చిరంజీవి ఇవాళ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీ సానుకూలంగా జరిగిందని, త్వరలో సమస్య పరిష్కారమవుతుందని సమావేశం అనంతరం చిరంజీవి చెప్పారు. దీనిపై స్పందించిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై చర్చించేందుకు చిరంజీవి తనతో పాటు ఆచార్య సినిమా నిర్మాత కమ్ జగన్ కేసుల లాయర్ కూడా అయిన నిరంజన్ రెడ్డిని వెంటబెట్టుకుని వచ్చారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. వారికి ఉన్న పరస్పర సంబంధాలతోనే చిరంజీవి ఈ భేటీకి టాలీవుడ్ తరఫున వచ్చారని రఘురామ పేర్కొన్నారు. జగన్ వారం వారం కోర్టుకు రాకపోయినా నిరంజన్ రెడ్డి సాయంతోనే తప్పించుకుంటున్నట్లు కూడా రఘురామ తెలిపారు. కాబట్టి ఆచార్య సినిమా నిర్మాతగా కాకపోయినా జగన్ లాయర్ కోణంలో అయినా ఆయన చిరంజీవితో కలిసి సీఎం వద్దకు వెళ్లడం శుభపరిణామం అని రఘురామ అన్నారు.
చిరంజీవి-జగన్ భేటీతో అయినా సినిమా పరిశ్రమపై ప్రభుత్వం దాడులు ఆగిపోతాయని ఆశిస్తున్నట్లు రఘురామ తెలిపారు. ఈ టాలీవుడ్ పై జరుగుతున్న దాడికి పేదలపై ఆయన కున్న ప్రేమే నిదర్శనమని జగన్ ను ఉద్దేశించి రఘురామ వ్యంగంగా వ్యాఖ్యానించారు. పేదల్ని రకరకాలుగా పన్నులు వేసి దోచుకుంటున్నప్రజలు తమ కష్టాల్ని మర్చిపోవాలంటే వారు చూసే సినిమా రేట్లను తగ్గించాలని జగన్ భావించినట్లున్నారని రఘురామ ఆరోపించారు. సినిమా టికెట్ల రేట్ల తగ్గింపును అడ్డుకునేందుకు చంద్రబాబు,, టాలీవుడ్ ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలు చాలా బాధనిపించాలని జగన్ చెప్పడాన్ని కూడా రఘురామ ఆక్షేపించారు. కాబట్టి పేదల కోణంలో టాలీవుడ్ పై చూపిస్తున్న ప్రేమను జగన్ కొంచెం తగ్గించుకుని ఇండస్ట్రీకి చిరంజీవి ద్వారా న్యాయం చేయాలని ఆశిస్తున్నాన్నారు.