ఏపీ అప్పులపై ప్రధాని జోక్యం కోరిన రఘురామ-పరిమితుల ఉల్లంఘన కాకుండా చట్టానికి డిమాండ్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అప్పుల వ్యవహారం పార్లమెంటులోనూ ప్రస్తావనకు వచ్చింది. ఇవాళ లోక్ సభలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ ఈ వ్యవహారాన్ని లేవనెత్తారు. ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న అప్పులపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధాని మోడీ జోక్యం కోరారు.
ఏపీ ఆర్ధిక పరిస్ధితి దారుణంగా మారిందంటూ లోక్ సభలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ ప్రస్తావించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విధిస్తున్న అప్పులు తీసుకునే ఎఫ్ఆర్బీఎం పరిమితిని ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని రఘురామ ఆరోపించారు. దీంతో ఆర్టికల్ 293 ఉల్లంఘన జరుగుతోందని రఘురామ ఆరోపించారు. ప్రస్తుతం ఏపీ అఫ్పులు 7 లక్షల కోట్లకు చేరాయని, మరో లక్ష కోట్లు అప్పులు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రఘురామ లోక్ సభ దృష్టికి తెచ్చారు.

ఏపీ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితి ఉల్లంఘించడాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకోవాలని రఘురామరాజు లోక్ సభలో కోరారు. ఇలాంటి ఉల్లంఘనలు అరికట్టేందుకు చట్టం చేయాలని డిమాండ్ చేశారు. వ్యవస్ధలు నిర్వీర్యం కాకుండా, బ్యాంకులు దివాళా తీయకుండా ఉండాలంటే ప్రధాని మోడీ ఏపీ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితి ఉల్లంఘనలపై జోక్యం చేసుకుని చర్యలు చేపట్టాలని రఘురామ డిమాండ్ చేశారు. రఘురామరాజు ఈ వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్న సమయంలో విపక్ష ఎంపీలు లోక్ సభలో బిగ్గరగా నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగాన్ని సైతం అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వీరి నినాదాల మధ్యే రఘురామ రాజు తన ప్రసంగం కొనసాగించారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వ అప్పులపై రఘురామ లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ సమాధానం ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై రఘురామ తరచుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కేంద్రం, ప్రధాని జోక్యం కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లేదా ఆర్ధిక శాఖ సహాయమంత్రి సమాధానం చెప్పే అవకాశముంది. ఇప్పటికే ఏఫీ ఆర్ధిక పరిస్ధితులపై కాగ్ నివేదికలతో పాటు కేంద్ర ఆర్ధిక శాఖ కూడా పలు అభ్యంతరాలు లేవనెత్తుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications