నా గుండెలపై కూర్చుని కొట్టారు- బర్త్ డే రోజున రఘురామ షాకింగ్ కామెంట్స్-అమిత్ షా గ్రీటింగ్స్
ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే నిత్యం విమర్శలు చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ మరోసారి సొంత పార్టీని, అధినేత వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న రఘురామ.. వైసీపీ సర్కార్ విధానాలపై మరోసారి రెచ్చిపోయారు.
గతంలో సీఐడీ కస్టడీలో తనపై జరిగిన దాడిని కూడా ఈ సందర్భంగా రఘురామరాజు గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా సీఐడీ కస్టడీలో పోలీసులు తన గుండెలపై కూర్చుని విపరీతంగా కొట్టారని ఆయన ఆరోపించారు. మొత్తం ఐదుసార్లు తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని, మధ్యలో తన సెల్ ఫోన్ కోసం వెతికి మరీ తనను కొట్టారని రఘురామ ఆరోపించారు. ఓ కానిస్టేబుల్ వచ్చి తనను ఎవరు కొట్టారని అమాయకంగా అడిగారని, ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్ వచ్చి మంచంపై పడుకోబెట్టారని వెల్లడించారు.
సీఎం జగన్ తో పాటు సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ ఇద్దరూ అద్భుతమైన కళాకారులని రఘురామ విమర్శించారు. ఉన్మాద సంస్కృతిలో భాగంగానే తనపై దాడి జరిగిందన్నారు. ఇది తనకు 60వ పుట్టిన రోజు అని చెప్పిన రఘురామ.. 59వ పుట్టిన రోజును ఘనంగా జరిపిన ఉన్మాదికి ధన్యవాదాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2024లోనే వారికి ప్రజలు బుద్ధి చెప్తారని రఘురామ వ్యాఖ్యానించారు.
మరోవైపు 60వ పుట్టిన రోజు జరుపుకుంటున్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ పర్యటన తర్వాత రఘురామతో భేటీ కానున్నట్లు అమిత్ షా చెప్పినట్లు ఆయన వెల్లడించారు. దీంతో వీరిద్దరి భేటీ వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.