ఇక టీవీ డిబేట్లకు వీరే..లిస్ట్ విడుదల చేసిన వైసీపీ..!
ఏపీలో జరిగిన తాజా ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత విపక్ష వైసీపీకి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ముఖ్యంగా ఓవైపు అధికారం ఉన్నంతసేపు పార్టీతో అంటకాగిన నేతలు.. అధికారం పోగానే తోక జాడిస్తున్నారు. అంతే కాదు పార్టీలో సీనియర్ నేతలపై టీవీ డిబేట్లలో ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో పార్టీకి రాజకీయంగా కూడా నష్టం కలుగుతుందని భావిస్తున్న వైసీపీ.. వారిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది.
తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి ఏకంగా సొంత మీడియా సంస్థ సాక్షి టీవీలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. వైసీపీ నేత అయి ఉండి ఏకంగా అధినేత ఛానల్లోనే సొంత పార్టీ పెద్దలపై విమర్శలు దిగిన రవిచంద్రారెడ్డి ఆ తర్వాత కూడా యూట్యూబ్ ఛానళ్లలో విమర్శలు చేస్తున్నారు. వీటిని సీరియస్ గా తీసుకున్న అధిష్టానం.. ఇకపై టీవీ డిబేట్లకు పిలవాల్సిన వారి జాబితాను విడుదల చేసింది.

ఈ జాబితాలో లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారితో పాటు మరో 14 మంది పేర్లు ఉన్నాయి. వీరిలో పొత్తా శివశంకర్ రెడ్డి, యనమల నాగార్జున యాదవ్, సుందర రామశర్మ, కారుమూరి వెంకటరెడ్డి, కొండా రాజీవ్, నారుమల్లి పద్మజ, కాకుమాను రాజశేఖర్, నారాయణమూర్తి, అవుతు శ్రీధర్ రెడ్డి, కొమ్మూరి కనకారావు, వంగవీటి నరేంద్ర, పోతిన మహేష్, గూడపురెడ్డి వీరశేఖర్ రెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి ఉన్నారు. వీరిని మాత్రమే ఇకపై టీవీ చర్చలకు పిలవాలని వైసీపీ సూచించింది.












Click it and Unblock the Notifications