మూడు రాజధానులు ఫెయిలైతే.. ? వైసీపీ తాజా ప్లాన్ ఇదే !
ఏపీలో మూడు రాజధానుల వ్యూహంతో వైసీపీ ముందుకెళ్తోంది. హైకోర్టు అమరావతికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా సుప్రీంకోర్టులో దాన్ని సవాల్ చేయడం ద్వారా మూడు రాజధానుల్ని ఎట్టి పరిస్దితుల్లోనూ అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇంత చేస్తున్నా మూడు రాజధానుల ప్లాన్ విఫలమైతే.. ? సుప్రీంకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే.. ? ఎన్నికల ముందు ఈ వ్యవహారం విపక్షాలకు ఆయుధంగా మారకుండా ఉండాలంటే..? ఏం చేయాలనే దానిపై వైసీపీ ఓ అంచనాకు వచ్చేసినట్లు కనిపిస్తోంది.
మూడు ముక్కలాటలో
అమరావతి స్ధానంలో తెరపైకి వచ్చిన మూడు రాజధానుల వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ ఎదురవుతోంది. అసెంబ్లీ జగన్ ప్రకటన చేయగానే మూడు రాజధానులు అమల్లోకి వచ్చేసినట్లే ప్రచారం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో రాజధాని బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో మండలిలో ఎదురైన ఇబ్బందులతో బ్రేక్ పడినట్లు కనిపించింది. ఆ తర్వాత గవర్నర్ ఈ బిల్లుకు ఆమోదం తెలపగానే మళ్లీ అంతా సవ్యంగా సాగిపోతోందని అనిపించింది. కానీ హైకోర్టులో ఈ బిల్లుల్ని రైతులు సవాల్ చేయడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ సాగింది. చివరికి హైకోర్టు రెండేళ్ల పైగా విచారణ తర్వాత అమరావతే రాజధాని అని చెప్పేయగానే అంతా ముగిసినట్లే కనిపించింది. మళ్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు ఏం జరగబోతోందనే ఉత్కంఠ పెరుగుతోంది.
ఎన్నికల వేళ కీలకంగా సుప్రీం తీర్పు
వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఈ ఏడాది సుప్రీంకోర్టు మూడు రాజధానుల వ్యవహారంలో ఇచ్చే తీర్పు రాష్ట్రంలో అధికార వైసీపీతో పాటు విపక్షాలకు కూడా కీలకంగా మారిపోతోంది. సుప్రీం తీర్పు తర్వాత పరిస్ధితులు ఎలా మారతాయో తెలియక రాజకీయ పక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటికే అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర ఆగిపోయింది. వైసీపీ కూడా వికేంద్రీకరణ సభలు ఆపేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు తర్వాత రాష్ట్రంలో రాజకీయం ఎటువైపు తిరగబోతోందనే చర్చ మాత్రమే సాగుతోంది. దీంతో అందరి కంటే ముందుగా వైసీపీ ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తోంది.
ఉత్తరాంధ్ర రాష్ట్ర డిమాండ్
అమరావతి రాజధానికి అనుకూలంగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో దీనిపై విచారణ సాగుతోంది. అదే సమయంలో రాష్ట్రంలో ప్రత్యేక ఉత్తరాంధ్ర డిమాండ్ బయలుదేరింది. వైసీపీకి చెందిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నిన్న మొన్నటివరకూ విశాఖ రాజధాని డిమాండ్ వినిపించారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతుందన్నారు. కానీ అకస్మాత్తుగా టోన్ మార్చి ఇప్పుడు అమరావతే రాజధాని అయితే ఉత్తరాంధ్రకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేయమంటున్నారు. అదే సమయంలో రాయలసీమ నుంచి వైసీపీకి మద్దతుగా సీనియర్ నేత బైరెడ్డి కూడా రాయలసీమకే ప్రత్యేక రాష్ట్రం ఇమ్మంటున్నారు. దీంతో ధర్మాన మరింత టోన్ పెంచి అమరావతి రాజధాని అయితే ఉత్తరాంధ్ర కోసం పట్టుబడతామని పదే పదే చెప్తున్నారు. దీంతో వైసీపీ వ్యూహాలపై చర్చ మొదలైంది.
వైసీపీ తాజా ప్లాన్ ఇదే ?
రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవహారం తెరపైకి వచ్చినప్పుడు ఉన్నంత ఆసక్తి ఇప్పుడు లేదు. అలాగే అమరావతి గురించి కూడా చర్చ తగ్గిపోయింది. సుప్రీంకోర్టులో ఈ వ్యవహారంపై విచారణ జరిగి తుది తీర్పు రావాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్ధితుల్లో విపక్షాలతో పాటు కేంద్రంలోని అధికార బీజేపీ కూడా అమరావతికి మద్దతిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రేపు సుప్రీంకోర్టు కూడా ప్రతికూల తీర్పు ప్రకటిస్తే ఏం చేయాలనే దానిపై వైసీపీ ప్రత్యామ్నాయాలు సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వైసీపీ మంత్రి ధర్మాన ప్రత్యేక ఉత్తరాంధ్ర డిమాండ్ వినిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తద్వారా బీజేపీకి మరో కొత్త రాష్ట్రం ఏర్పాటుపై ఒత్తిడి పెంచేందుకు ఈ వాదన సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు అమరావతికి అనుకూలంగా వస్తే అందుకు ఉత్తరాంధ్ర జనాన్ని సిద్ధం చేసేందుకే వైసీపీ ఈ వ్యూహం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా రాజధానిగా తాము ప్రచారం చేసిన వైజాగ్ కు ఇలా న్యాయం చేస్తామని పరోక్షంగా హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.