YSRCP Third List: వైసీపీ మూడో లిస్ట్ విడుదలకు సర్వం సిద్ధం -ఈసారి 29 సీట్లలో మార్పులు ?
ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ అభ్యర్ధుల మార్పులు చేర్పులు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న అభ్యర్ధుల్ని మార్చకుండా కేసీఆర్ దెబ్బతినడంతో వెంటనే అప్రమత్తమైన వైఎస్ జగన్ ఇన్ ఛార్జ్ ల మార్పుకు తెరదీశారు. ఇప్పటికే తొలి జాబితాలో 11 మందినీ, రెండో జాబితాలో 27 మందినీ మార్చేశారు. ఇప్పుడు మూడో జాబితా విడుదలకు రంగం సిద్ధం చేశారు.
ఇవాళ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వీరిలో కృష్ణాజిల్లాకు చెందిన కొడాలి నాని, సింహాద్రి రమేష్, పేర్నినాని, పార్ధసారధి ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని, మద్దిశెట్టి వేణుగోపాల్, జంకే వెంకటరెడ్డి, కుందూరు నాగార్జునరెడ్డి వంటి వారు ఉన్నారు. పల్నాడు జిల్లాకు చెందిన నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నందికొట్కూరు ఇన్ చార్జ్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి, కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బుగ్గన, చింతలపూడీ ఎమ్మెల్యే ఎలీజా, చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ డొక్కా వంటి వారు కూడా సీఎం జగన్ ను కలిశారు.

ఈ నేపథ్యంలో రేపు విడుదల చేస్తున్న 29 మంది జాబితాలో వీరిలో పలువురి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరి స్ధానాల్లో పలువురు కొత్త ఇన్ ఛార్జ్ లను ప్రకటించడమో లేక మరో చోటుకు మార్చడమో చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే వీరిలో పలువురిని ఎంపీలుగా పోటీ చేయించేందుకు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ లోక్ సభకు బొత్స ఝాన్సీ వంటి వారిని రంగంలోకి దించబోతున్నారు. ఈ పేరు కూడా రేపటి జాబితాలో ఉండొచ్చని సమాచారం. ఈ 29 మంది జాబితా కూడా విడుదలైతే ఇప్పటికే విడుదలైన రెండు జాబితాల్లో ఉన్న 38 మందితో కలిపి మొత్తం 67 మంది అవుతారు.












Click it and Unblock the Notifications