నిమ్మగడ్డకు టీడీపీ నేతల సన్మానం -ఎస్ఈసీ ఆలయాల సందర్శనలో సంచలనం -చంద్రబాబు విశ్వాసం కోసం..
ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలపై వివాదం రోజుకో మలుపు తిరుగుతుండటం, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ మధ్య విభేదాలు తీవ్రస్తాయికి చేరడం, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. చంద్రబాబుకు తాబేదారుగా వ్యవహరిస్తున్నాడని సాక్ష్యాత్తూ మంత్రులే విమర్శలు చేస్తున్న తరుణంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. పంచాయితీ ఎన్నికల వివాదం, రాష్ట్రంలో ఆలయాలపై దాడుల వ్యవహారం వేడెక్కిన వేళ నిమ్మగడ్డ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా..

ఆలయాల బాటపట్టిన ఎస్ఈసీ
ఏపీలో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జారీ చేసిన షెడ్యూల్ ను జగన్ సర్కారు విభేదించింది. ఎస్ఈసీ ఇలా ఇలా నోటిఫికేషన్ విడుదల చేయగానే ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించబోమని సీఎస్ ఆధిత్యానాథ్ తేల్చి చెప్పారు. ఇప్పటికే హైకోర్టు మెట్లెక్కిన జగన్ సర్కార్ ఎన్నికల కమిషన్ ప్రొసీడింగ్స్పై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాలనుకుంటోంది. మరోవైపు ఏపీలో ఆలయాలపై దాడుల వివాదంలో జగన్ సర్కారు ఇరుకునపడిన వేళ.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వరుసగా ఆలయాల సందర్శనలు మొదలుపెట్టారు. శనివారం నాడు మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న నిమ్మగడ్డ.. ఆదివారం నాడు కృష్ణా జిల్లా మోపిదేవిలోని సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం, పెదకళ్లేపల్లి శ్రీ దుర్గానాగేశ్వర స్వామి ఆలయం, మొవ్వ గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాకుళంలోని శ్రీకాకులేశ్వరస్వామి ఆలయానికి కూడా ఆయన వెళ్లనున్నారు. కాగా..

నిమ్మగడ్డకు టీడీపీ నేతల సన్మానం
మోపిదేవిలోని సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయ దర్శనం కోసం వచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కు ఆలయ అర్చకులు, పూజారులు.. పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పుట్టలో పాలు పోసిన ఎస్ఈసీ.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే, పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ వేణుగోపాల స్వామిని దర్శించుకున్న సమయంలో నిమ్మగడ్డను కలిసిన వ్యక్తులను ఉద్దేశించి అధికార వైసీపీ తీవ్ర అభ్యంతరాలు తెలిపింది. మొవ్వ ఆలయంలో నిమ్మగడ్డకు టీడీపీ నేతలు సాదర స్వాగతం పలకడమే కాకుండా, స్వయంగా సన్మానాలు కూడా చేశారని వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆరోపించారు.

టీడీపీతో ఎస్ఈసీ కుమ్మక్కు..
''రాజ్యాంగ పదవిలో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ టీడీపీ నేతలా మారిపోయారు. మొవ్వ వేణుగోపాల స్వామి ఆలయంలో పలువురు టీడీపీ నేతలు.. ఎస్ఈసీని ఘనంగా సన్మానించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి టీడీపీ నేతలతో సన్మాలానా? నిమ్మగడ్డ.. టీడీపీ నేతలా మారిపోయారనడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా?'' అని వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ దుయ్యబట్టారు. కాగా..

నిమ్మగడ్డపై మంత్రుల ఫైర్..
ప్రభుత్వం నో చెబుతున్నా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తానంటూ ఎస్ఈసీ మొండిగా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ''కరోనా కేసులు పెరుగుతుంటే ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు?, ఎన్నికలు వాయిదా వేయాలని కోరిన గంటకే షెడ్యుల్ ఎలా ప్రకటిస్తారు? ఆయన నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయి. నిమ్మగడ్డ వెనుక రాజ్యాంగేతర శక్తి ఉందనిపిస్తోంది'' అని బొత్స అన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ,ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో దుర్మార్గం అని మరో మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు విశ్వాసం కోసమే నిమ్మగడ్డ మూర్ఖత్వంతో ఎన్నికల నిర్వహణకు పూనుకున్నారని మంత్రి ఫైరయ్యారు. ఇదిలా ఉంటే..

జగన్పై నిమ్మగడ్డదే పైచేయి?
ఏపీలో స్థానిక ఎన్నికల విషయమై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన జగన్ సర్కారు.. మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టాలని యోచిస్తున్న నేపథ్యంలో కేరళ వివాదం చర్చనీయంశమైంది. గత నెలలో కేరళలో స్థానిక ఎన్నికల వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించడం, కోవిడ్-19 బాధితులు, 65 ఏళ్లకు పైబడిన పౌరులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చని కేంద్ర 27/ఏ నిబంధనను సవరిస్తూ ఈసీ నోటిఫికేషన్ ఇచ్చిందని జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరావు గుర్తుచేయడం తెలిసిందే. కేరళ తరహాలోనే ఏపీ సర్కారు వాదనను కూడా ఆలకించడానికి ధర్మాసనం ఆసక్తి చూపే అవకాశం లేదని, స్థానిక ఎన్నికల విషయంలో జగన్ పై నిమ్మగడ్డదే పైచేయి కానుందనే వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications