పలుకుతుంది పవనే..! మరి పలికిస్తుందెవరు అంటున్న వైసీపి..!!
అమరావతి/హైదరాబాద్ : జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సంచలనాలు నమోదు చేస్తూనే ఉంటారు. గెలిచినా.. ఓడినా కూడా తన ఇమేజ్ చెక్కుచెదరదంటారు అభిమానులు. పవన్ ఒక్క సినిమా చేస్తే చాలు కోట్లు పెట్టుబడి పెట్టేందుకు నిర్మాతలు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. సామాజికంగా.. సినిమా పరంగా అంతటి క్రేజ్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయంగా దొర్లుతున్న ఒడిదొడుకులను మాత్రం అధిగమించలేకపోతున్నారు. 2014కు ముందు పవన్ కేవలం ఓ ప్రజా నాయకుడు మాత్రమే. కానీ ఆ సమయంలో రాష్ట్రం విడిపోయింది. ఏపీ, తెలంగాణల్లో సెంటిమెంట్ నడుస్తుంది. నరేంద్రమోదీ చరిష్మాతో కేంద్రంలో బీజేపీ గెలుపు ఖాయం చేసుకున్నారు. అటువంటి సమయంలో ఏపీలో టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా మారింది. కాని పరిస్థితులు పవన్ కళ్యాణ్ అండతో ఒక్కాసారిగా టీడిపికి అనుకూలంగా మారిపోయాయి.
స్వరం పెంచిన పవన్ కళ్యాణ్..! ఈవిఎంల ప్రస్థావనతో రేగిన రాజకీయ దుమారం..!!
పదేళ్లపాటు విపక్షంలో ఉన్న టీడీపీ గెలుపు కష్టమనేంతగా చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది. ఆ సమయంలో చంద్రబాబు అప్పటి వరకూ దూరంగా ఉంచిన బీజేపీతో దోస్తీ కట్టాడు. మోదీ పేరు వాడుకున్నాడు. విడిపోయిన ఏపీలో కీలకమైన కాపుల ఓట్ల కోసం పవన్ తో స్నేహం చేసారు. అనూహ్యంగా టీడిపి అదికారంలోకి వచ్చింది. ఆ తర్వాత అమరావతి రాజధానిగా చేసినపుడు పవన్ సమ్మతి తెలిపినా, వేలాది ఎకరాల భూ సేకరణను మాత్రం వ్యతిరేకించారు. లోకేష్ కేంద్రంగా సాగుతున్న పాలనపై ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో వామపక్షాలతో పోటీ చేసిన జనసేనాని, టీడీపీని పక్కనబెట్టి కేవలం జగన్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు కురిపించారు. అక్కడే పవన్ టీడీపీ ఏజెంట్ అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో వైసీపీ విజయం సాధించింది. ప్రజలు కూడా అధికారంలో ఉన్న పార్టీ పట్ల వ్యతిరేకతగా ఉంటారు. పాలనను విమర్శించే పార్టీని తమకు అనుకూలమనే అభిప్రాయానికి వస్తారు.
అదికార పార్టీ విధానాల వల్ల రాష్ట్రం మరింత తిరోగమనం..! మండిపడుతున్న గబ్బర్ సింగ్..!!
జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడే తన ప్రణాళిక మిస్సయ్యారు. ఫలితంగా రాజకీయాల్లో చేదు అనుభవాన్ని చవిచూశారు. ఇప్పుడు అదే పవన్ మరోసారి రాజధాని మార్పు విషయంలో జగన్ కు వ్యతిరేకంగా మాట్టాడుతున్నారు. కానీ వైసీపీ మాత్రం, తమకు వ్యతిరేకంగా మాట్లాడే బదులు టీడీపీకి అనుకూలంగా పవన్ వ్యవహరిస్తున్నారంటూ అదికార వైసిపి విమర్శలకు దిగుతోంది. మంత్రి హోదాలో బొత్స సత్యనారాయణ చేసిన రాజధాని మార్పిడి కామెంట్స్ ఏపీలో ప్రకంపనలు స్రుష్టిస్తున్నాయి. పవన్ తనదైన శైలిలో అమరావతి పరిధిలో గ్రామాల రైతులతో సమావేశం అవుతున్నారు. రాజు మారితే రాజదాని మార్చుతారా అంటూ లేవనెత్తిన ప్రశ్న బాగానే కనెక్టయింది. అదే సమయంలో పవన్ వ్యాఖ్యలను వైసీపీ తనకు అనుకూలంగా మలచుకోవాలనుకుంటుంది.
కాటమరాయుడుకు టీడిపి మద్దత్తు..! ఘాటుగా విమర్శిస్తున్న వైసీపి..!!
అయితే పవన్ మాత్రం తన మాటల దాడిని మరింత తీవ్రతరం చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసి, జగన్ అవినీతిని, ఈవీఎంలను మేనేజ్ చేశారనే విషయాన్ని మరోసారి తెరమీదకు తెచ్చారు. వందరోజుల జగన్ పాలనపై ప్రజల్లో చాలా వ్యతిరేకత నెలకొందని, రివర్స్ టెండరింగ్ పేరిట, 32 వేల కోట్ల రూపాయల విలువైన పనులు నిలిచిపోయాయని గబ్బర్ సింగ్ మండిపడుతున్నారు. వాటిలో కేవలం పోలవరం ఒక్కటే కాదని, పేదల పక్కాఇళ్లు, రోజూ వారి నడిచే రహదారుల కూడా కళ్లెదుట కనిపిస్తున్నాయని తెలిపారు. జగన్ ఒంటెద్దు పోకడలతో లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం ఎంతగానో నష్టపోతోందని పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది జనసేన.
అదికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షం..! మద్యలో జనసేన అంటున్న నాయకులు..!!
రాజకీయంగా పవన్ కూడా పరిణితితోనే వ్యవహరిస్తాడనేందుకు ఇదే నిదర్శనమంటూ జనసైనికులు అంచనా వేసుకుంటున్నారు. టీడీపీ నేతలు కూడా జగన్ కు వ్యతిరేకంగా సొంతంగా గొంతు విప్పుతున్న పవన్ కళ్యాణ్ కు మద్దత్తు ఇచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అనుకోకుండా పవన్ రూపంలో ప్రభుత్వ వ్యతిరేకత ఆందోళనను, జగన్ పై వ్యతిరేకత ను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కావాల్సిన ఇన్ పుట్స్ ను జనసేనకు అందివ్వాలనే ఎత్తుగడ కూడా టీడిపిలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామం జనసైనికుడికి కలిసొస్తుందా..? బెడిసి కొడుతుందా కాలమే నిర్ణయించాలి మరి.