దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమమా? పవన్ ను టార్గెట్ చేసిన వైసీపీ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విక్రయం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని కల్లబొల్లి కబుర్లు కథలు చెబితే నమ్మడానికి చెవిలో క్యాబేజీ పూలు పెట్టుకొని కూర్చో లేదంటూ, రాష్ట్ర ప్రభుత్వాలు లేఖల రాజకీయాలు చేయొద్దంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో జగన్ సర్కార్ పై ధ్వజమెత్తారు. దీంతో వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన పవన్ కళ్యాణ్
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా అఖిలపక్షం ఏర్పాటు చేసే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ కు వారం రోజుల డెడ్లైన్ విధించారు. ఆ లోగా వైసిపి తన వైఖరి వెల్లడించకుంటే తాను ఉద్యమంలోకి దిగక తప్పదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు రాజీనామాలు చేయడం లేదని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్, రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులను చేయాలంటూ విశాఖ వేదికగా గర్జించారు.

జనసేన పార్టీది స్థిరత్వం లేని విధానం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ ను వైసీపీ మంత్రులు నేతలు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. జనసేన విధి విధానాలు ఎవరికీ అర్థం కావడం లేదని హోంమంత్రి సుచరిత వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీతో స్నేహం చేస్తూ రాష్ట్రంలో శతృత్వమా అంటూ ప్రశ్నించారు. జనసేన పార్టీది స్థిరత్వం లేని విధానం అని హోం మంత్రి సుచరిత వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తానని చెప్పడం దేనికో చెప్పాలని ఎద్దేవా చేశారు హోంమంత్రి సుచరిత.

పవన్ కళ్యాణ్ కు నిలకడ లేదు : హోం మంత్రి సుచరిత
పవన్ కళ్యాణ్ కు సిద్ధాంతపరంగా నిలకడ లేదని వ్యాఖ్యానించారు. జనసేనను ప్రజలు నమ్ముకోవడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పవన్ కళ్యాణ్ కేంద్రంతో మాట్లాడి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయొచ్చు కదా అంటూ ప్రశ్నించారు. అమరావతిని పూర్తిగా తరలిస్తామని సీఎం ఎక్కడా చెప్పలేదని వ్యాఖ్యానించారు హోంమంత్రి సుచరిత. అమరావతిలో రైతు ఉద్యమం చేయడం లేదని అమరావతి ఉద్యమాన్ని పెట్టుబడిదారులు నడిపిస్తున్నారని సుచరిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

260రోజులుగా పోరాటం చేస్తుంటే పవన్ కు ఇప్పుడు పోరాటం గుర్తొచ్చిందా
ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్ర ప్రభుత్వ అజెండాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భుజానికెత్తుకున్నారు అని వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులంతా ఖండించాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వంపై పల్లెత్తు మాటకూడా అనకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం వెనుక ఆంతర్యమేమిటని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. 260 రోజులుగా విశాఖ ఉక్కు కోసం కార్మిక నాయకులు పోరాటం చేస్తూ ఉంటే, దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

పవన్ కు దమ్ముంటే కేంద్రంపై పోరాటం చెయ్ : గుడివాడ అమర్నాథ్
పవన్ కళ్యాణ్ కు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో పోరాటం చేయాలని హితవు పలికారు గుడివాడ అమర్నాథ్. గెలిపిస్తే పోరాటం చేస్తానన్న పవన్ కళ్యాణ్, గెలవకపోయినా పోరాటం సాగుతుందని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటంలో వైయస్సార్సీపి పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పార్లమెంటులో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పలుమార్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఎంపీలు స్పీకర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారని పేర్కొన్న గుడివాడ అమర్నాథ్ ఇదంతా పవన్ కళ్యాణ్ కు తెలియదా అంటూ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications