మరో నిరసనకు వైసీపీ పిలుపు
YS Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ తన పోరాటాలను మరింత తీవ్రతరం చేసింది. వరుస ఆందోళనలకు పిలుపునిస్తోంది.
జూన్ 13న వైఎస్ఆర్సీపీ విద్యార్థి, యువజన విభాగాలు నిరసనల కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు తెలపాలని నిర్ణయించాయి. ఏడాదిగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేసినందుకు ఈ నిరసన చేపట్టనున్నాయి.

అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి, యువజన విభాగాలు నిర్ణయించాయి. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఫీజురీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది వైఎస్ఆర్సీపీ.
సూపర్ సిక్స్.. అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు చేతులెత్తేయడంపై నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తోందని మండిపడుతోంది. ఉద్యోగాలు కల్పించకపోతే ప్రతినెలా 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీనీ విస్మరించడం సరికాదని చెబుతోంది. కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందంటూ వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది.
చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని, దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. తక్షణమే ఫీజురీఎంబర్స్ మెంట్ విడుదల చేయాలని పట్టుబట్టింది.












Click it and Unblock the Notifications