బాబుని కార్నర్ చేసేందుకు జగన్: హైకోర్టు నుంచి 'స్విస్' దాకా..
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. హైకోర్టు విభజన నుంచి కృష్ణపట్నం భూములు, ఆలయాల వరకు అన్నింటా చంద్రబాబును టార్గెట్ చేసింది.
వైసిపి నేత పార్థసారథి బుధవారం మాట్లాడుతూ.. అభివృద్ధి పేరుతో చంద్రబాబు దేవాలయాలను కూల్చడం దారుణమన్నారు. గోశాల, కృష్ణుడి ఆలయాన్ని కూల్చడం సరికాదన్నారు. ఆలయాలనే కాకుండా చర్చిలను, మసీదులను కూడా కూల్చుతున్నారన్నారు.
సీఎం దృష్టి ఇప్పుడు ఆలయాల పైన పడిందని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో దేవుడికి కూడా స్థానం లేదా అని ప్రశ్నించారు. సదావర్తి భూములను కూడా టిడిపి నేతలు అడ్డగోలుగా దోచుకున్నారని ధ్వజమెత్తారు. బాబు చర్యల పైన బీజేపీతో పాటు ముస్లీంలు, క్రిస్టియన్ల మత పెద్దలు స్పందించాలన్నారు.
కృష్ణపట్నం భూములపై కాకాని
టిడిపి ప్రభుత్వం రుణమాఫీ కేవలం ఆర్భాటమేనని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైసిపి నేత కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. అసలు రుణమాఫీ జరగడం లేదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎరువుల ఫ్యాక్టరీ కోసం చైనాతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏముందన్నారు. అసలు గ్యాస్ లేకుండా పరిశ్రమ ఎలా వస్తుందని ప్రశ్నించారు.
కాగా, అంతకుముందు వైసిపి నేత శ్రీకాంత్ రెడ్డి కూడా హైకోర్టు విభజన విషయంలో చంద్రబాబు తీరు పైన అనుమానం వ్యక్తం చేశారు. అన్ని కార్యాలయాలను అమరావతి తరలించిన చంద్రబాబు హైకోర్టును మాత్రమే ఎందుకు తరలించడం లేదని ప్రశ్నించారు.
టిఆఆర్ఎస్ నేతలు కూడా అదే వాదన చేస్తున్నారు. అన్ని కార్యాలయాలు వెళ్లినప్పుడు హైకోర్టు విభజన ఎందుకు ఆపుతున్నారని, కావాలంటే స్థలం ఇస్తామని చెబుతోంది. కోర్టు ద్వారా తెలంగాణను ఏలాలనుకుంటున్నారని తెరాస నేతలు బాబుపై మండిపడుతున్నారు.
వైసిపి నేతలు కూడా హైకోర్టును తరలించకపోవడంపై అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. అయితే, ఇంకా విభజన సమస్యలు పూర్తి కాలేదని, నీటి సమస్యలు, షెడ్యూల్ 9, 10 విభజన అలాగే ఉందని, కానీ తెరాస కేవలం హైకోర్టు విభజనను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తుందని తెలుగుదేశం పార్టీ చెబుతోంది.
స్విస్ ఛాలెంజ్ అంశంతో ఇరుకున పడేయాలని వైసిపి భావిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం నాడు రోజా సహా పలువురు వైసిపి నేతలు స్విస్ ఛాలెంజ్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే, స్విస్ ఛాలెంజ్ను టిడిపి నేతలు సమర్థిస్తున్నారు.
ఇదిలా ఉండగా, స్విస్ ఛాలెంజ్ పైన చంద్రబాబు రెండో ఆలోచన చేస్తున్నారా అనే చర్చ కూడా సాగుతోంది. రాజధాని అభివృద్ధికి చంద్రబాబు స్విస్ ఛాలెంజ్ తెరపైకి తీసుకు వచ్చారు. ఇప్పటికే విపక్ష విమర్శిస్తున్నాయి.
స్విస్ ఛాలెంజ్ నేపథ్యంలో సింగపూర్ షరతుల విషయమై చంద్రబాబుతో అధికారులు ప్రత్యేకంగా చర్చలు జరిపారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్విస్ ఛాలెంజ్ లాభ నష్టాల పైన చర్చించారని అంటున్నారు. అంతేకాదు, స్విస్ ఛాలెంజ్కు కేంద్రం అంగీకరించాలని విపక్షాలు అంటున్నాయి. అయితే, అన్నీ బేరీజు వేసుకున్న తర్వాతనే అనుభవం కలిగిన చంద్రబాబు స్విస్ ఛాలెంజ్కు అంగీకరించారని ఇంకొందరు అంటున్నారు.