సభలో మేముండి ఏంలాభం, వాకౌట్ చేస్తున్నాం:జగన్, రోజా ఆగ్రహం
హైదరాబాద్: బిల్లుల పైన తమకు కనీసం సమాచారం ఇవ్వడం లేదని అలాంటప్పుడు మేం సభలో ఉండి ఏం లాభమని, అందుకే వాకౌట్ చేస్తున్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ గురువారం అన్నారు. బిల్లులు ప్రవేశ పెట్టే తీరును నిరసిస్తూ వైసిపి శాసన సభ నుంచి వాకౌట్ చేసింది.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. తమకు బిల్లుల పైన కనీసం సమాచారం ఇవ్వడం లేదన్నారు. వారం రోజుల ముందు ప్రతులు ఇవ్వాలని, కానీ కనీసం మూడు రోజుల ముందు కూడా ఇవ్వడం లేదన్నారు. కనీస సమాచారం లేకుండా తాము మద్దతు ఎలా ఇస్తామని ప్రశ్నించారు.
ప్రతులు చూపిస్తే అందులోని లోపాలు ఎత్తి చూపిస్తామన్నారు. తద్వారా సవరణలకు అవకాశముంటుందని అన్నారు. బిల్లుల పైన చర్చ లేకుండా ఆమోదించే తీరును తాము నిరసిస్తున్నామన్నారు. ఇక మేం ఉండి ఏం లాభమని, అందుకే వాకౌట్ చేస్తున్నామన్నారు.
రోజ ఆగ్రహం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు అసెంబ్లీ నుంచి గురువారం నాడు వాకౌట్ చేశారు. సభలో ప్రవేశ పెడుతున్న బిల్లుల తీరు పైన వారు నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు. చర్చించే వ్యవధి లేకుండా బిల్లులు పెట్టడం ఏమిటని వైసిపి ప్రశ్నించింది.
వాకౌట్ అనంతరం నగరి ఎమ్మెల్యే రోజా మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. సభలో టిడిపి బుల్డోజ్ చేస్తోందన్నారు. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. జగన్ను మాట్లాడనివ్వడం లేదన్నారు. ఇప్పటికిప్పుడు బుక్కులు ఇచ్చి, ఇప్పుడే ఆమోదించాలనడం ఎంత వరకు సమంజసమన్నారు.
మూడు రోజుల ముందు కూడా బిల్లు ప్రతులు ఇవ్వలేదన్నారు. బిల్లు ముందే ఇచ్చి, దానిని అవగాహన చేసుకున్న తర్వాత చర్చ జరగాలన్నారు. ఏదైనా బిల్లు పెట్టాలనుకుంటే కనీసం వారం రోజుల ముందు బిల్లు ప్రతులు ఇవ్వాలన్నారు. కానీ కనీసం మూడు రోజుల ముందు కూడా ఇవ్వలేదన్నారు.
సభా నియమాలను పాటించకుండా బిల్లులను ప్రవేశ పెడుతున్నారన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు తమ పార్టీని సైకో పార్టీ అనడం విడ్డూరమని మరో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. మంత్రి కామినేని శ్రీనివాస రావు తీరు... తమ ప్రభుత్వం వచ్చాక మనుషుల జీవన వయస్సు తగ్గిపోయినట్లుగా ఉన్నట్లుందన్నారు.