నిలదీద్దాం: జగన్, బీఏసీ అసంతృప్తి, ఎమ్మెల్యేల డుమ్మా
హైదరాబాద్: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం వైఫల్యాలను గట్టిగా నిలదీయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం లోటస్ పాండ్ క్యాంప్ కార్యాలయంలో శాసన సభాపక్షంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
అసెంబ్లీ వేదికపై ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా నిలదీయాలన్నారు. ప్రజా సమస్యలన్నింటినీ సభలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేలకు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు విధిగా హాజరుకావాలని ఎమ్మెల్యేలన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజా సమస్యల పైన మనం ముందుండి పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు.
సభలో మన వాదనలు బలంగా ఉండాలన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా మనమంతా వ్యవహరించాలన్నారు. పార్టీలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు లేకుండా అందరిదీ ఒకేమాటగా, ఒకే బాటగా ఉండాలన్నారు. అసెంబ్లీలో ప్రస్తావించే అంశాలపై సభ్యులు ముందుగా సిద్ధమై సభలో మాట్లాడాలన్నారు.
కాగా, రేపటి బీఏసీ సమావేశానికి హాజరు కాకూడదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయించింది. బీఏసీలో ప్రాధాన్యం లేని కల్పించడం లేదని నిరసిస్తూ గైర్హాజరు కావాలని నిర్ణయించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.