ఆ పార్టీ అంతు చూస్తా- సాయిరెడ్డి మాస్ వార్నింగ్
అమరావతి: ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీనితోపాటు లోక్సభ ఎన్నికలను ఎదుర్కోనుంది రాష్ట్రం. దీని కోసం అన్ని పార్టీలు సమయాత్తమౌతోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం, బీజేపీ, జనసేన.. ఎన్నికల దిశగా కసరత్తు సాగిస్తోన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్- వై నాట్ 175 నినాదంతో దూసుకెళ్తోన్నారు.
యువగళం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తోన్నారు. వారాహి బస్సు యాత్ర ద్వారా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మకాం వేశారు. కాపు సామాజిక వర్గ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉండే జిల్లాలు కావడం వల్ల రాజకీయంగా ఆయన పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
తన పర్యటనల సందర్భంగా పవన్ కల్యాణ్ వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నారు. ఘాటు విమర్శలు చేశారు. వాటి అవసరమే లేదంటూ తేల్చి చెబుతున్నారు. వలంటీర్లు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, వైసీపీ కార్యకర్తలుగా పని చేస్తోన్నారంటూ మండిపడుతున్నారు.

దీన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రతి ఒక్కరికీ ఎంతో మేలును కలిగిస్తోన్న వలంటీర్లు, సచివాలయాలపై ప్రతిపక్షాలు చేస్తోన్న విధ్వేషపూరిత ప్రచారంపై ఎదురుదాడి చేస్తోందని, దీన్ని అడ్డుకోవడంతో పాటు ఎదరుదాడికి దిగాలని నిర్ణయించుకుంది. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది.
ఇదే క్రమంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయిరెడ్డి కూడా రంగంలోకి దిగారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఆయన పర్యటించనున్నారు. టీడీపీ-జనసేన చేస్తోన్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి సన్నద్ధమౌతోన్నారు. 26 జిల్లాల్లో పర్యటించడానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటోన్నట్లు సాయిరెడ్డి తెలిపారు.
తెలుగుదేశం పార్టీ అంతు చూస్తానని సాయిరెడ్డి హెచ్చరించారు. కుట్రలు, కుతంత్రాలు, నోట్ల కట్టలతో చేసే రాజకీయాలన్నీ ప్రజా క్షేత్రంలో ఓడిపోతాయని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉన్న రహస్య స్నేహితులందరూ ఒక్కచోటికి చేరారని, వారందరూ చెల్లాచెదరవుతారని అన్నారు. విజనరీ అని బిరుదులు తగిలించుకున్న వారికి కొత్త ఆలోచనలు రావట్లేదంటూ ఎద్దేవా చేశారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా తాము సరికొత్త సంక్షేమ పథకాలు తీసుకొస్తామని ప్రజల ముందుకు వెళ్లాల్సిన తెలుగుదేశం పార్టీ నాయకులు.. ప్రజలకు మేలు చేస్తోన్న వలంటీర్లు, సచివాలయాలపై ఆరోపణలు చేసే దయనీయ స్థాయికి దిగజారిపోయిందని మండిపడ్డారు.
తాము అధికారంలోకి వస్తే ప్రజల జీవితాలను ఇంతకంటే మెరుగుపరుస్తామని చెప్పుకోలేని పరిస్థితి టీడీపీ నాయకులదంటూ చురకలు అంటించారు. అర్థం లేని ఆవేశాలు, వీరంగాలతో పైసా ప్రయోజనం ఉండదని హితబోధ చేశారు.












Click it and Unblock the Notifications