అందుకే నన్ను ఆ సీబీఐ కేసులో ఇరికించారు - హైకోర్టుకు వైవీ సుబ్బారెడ్డి నివేదన..!!
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారినికి సంబంధించిన కేసుల్లో తనను అక్రమంగా ఇరికించారని ఆయన పేర్కొన్నారు. ఇందు హౌసింగ్ బోర్డు ఒప్పందాలకు సంబంధించిన అవకతవకలపై సీబీఐ నమోదు చేసిన కేసు పైన ఈ పిటీషన్ వేసారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి తోడల్లుడిని అయిన కారణంగానే తనను నిందితుడుగా చేర్చారని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
సుబ్బారెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ విచారించారు. పిటీషనర్ తరపున వివేక్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటీషనర్ పైన ఐపీసీతో పాటుగా అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైందని, కానీ ఈ చట్టం కింద మరే అధికారి నిందితుడుగా సీబీఐ నమోదు చేయలేదని వివరించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో నిందితుడుగా పేరు లేదన్నారు. గచ్చిబౌలి ప్రాజెక్టులో ఇందు ప్రాజెక్టుకున్న 50 శాతం వాటా పిటీషనర్ కు బదిలీ అయిందన్నదే ప్రధాన ఆరోపణగా కోర్టుకు తెలిపారు. 4.23 ఎకరాల గచ్చిబౌలి హౌసింగ్ ప్రాజెక్టును వసంత ప్రాజెక్టు దక్కించుకుందని వివరించారు.
మారిన మున్సిపల్ నిబందనలు.. ఆక్రమణలతో పాటుగా నిర్ణీత సమయంలో పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో ఇందులో భాగస్వామిగా ఉన్న ఇందూ ప్రాజెక్ట్స్ వెళ్లిపోయిందన్నారు. ఇందులో భాగంగా వసంత ప్రాజెక్టులోని 50 శాతం వాటాలను వైవీ సుబ్బారెడ్డికి విక్రయించారని తెలిపారు. ప్రతిఫలంగానే ఇందూకు కూకట్ పల్లిలో అదనంగా 15 ఎకరాలు కేటాయించటానికి పిటీషనర్ ఒత్తిడి తెచ్చరనే వాదనలో వాస్తవం లేదని వాదించారు.
ఆధారాలను సీబీఐ చూపించలేదని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలతో తొలుత నమోదు చేసిన కేసులో ఆయన పేరులేదన్నారు. పిటిషనర్కు అవినీతి నిరోధక చట్టం వర్తించదని తెలిపారు. దీంతో..కోర్టు ఈ కేసు విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది.