Bengaluru Violence: 80 మంది బళ్లారి జైలుకు షిఫ్ట్, నిందితులకు కరోనా పాజిటివ్, కలకలం !
బెంగళూరు/ బళ్లారి: దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు సిటీలో అల్లర్లకు కారణం అయ్యి అరెస్టు అయిన 145 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. అరెస్టు అయిన వారిలో కరోనా పాజిటివ్ వచ్చిన అల్లరిమూకలు ఉండటంతో వారిని COVID-19 కేర్ ఆసుపత్రికి తరలించారు. బెంగళూరులో నానా రచ్చ చేసి రెచ్చిపోయిన 80 మంది పోటుగాళ్లను రాత్రికిరాత్రే బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు. అరెస్టు అయిన వారిలో కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లు ఉండటంతో మిగిలిన వాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. బెంగళూరు ఎమ్మెల్యే మేనల్లుడు. కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ భర్తతో సహ ఇప్పటి వరకు మొత్తం 145 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

పెట్రోల్ బాంబులతో దాడి
బెంగళూరు సిటీలోని పులకేశీనగర నియోజక వర్గం ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటిపై రాళ్లు, పెట్రోల్ బాంబులు వేసి ఆయన ఇంటితో పాటు పోలీసు వాహనాలు, ప్రైవేటు వాహనాలతో సహ అంబులెన్స్ లు కాల్చి బూడిద చేసిన కేసులో 145 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు అల్లరిమూకలు మరణించారు. అరెస్టు అయిన వారందరినీ కోర్టు ముందు హాజరుపరిచే ముందు వారికి ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షల ఫలితాలు వెలువడిన వెంటనే పోలీసులతో పాటు అరెస్టు అయిన నిందితులు షాక్ కు గురైనారు.

ముగ్గురికి కరోనా పాజిటివ్
బెంగళూరులో అరెస్టు అయిన వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో వారిని వెంటనే COVID-19 కేర్ ఆసుపత్రికి తరలించారు. కరోనా వచ్చిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న మిగిలిన నిందితులు షాక్ కు గురైనారు. ఎక్కడ మాకు కరోనా వైరస్ వ్యాధి సోకుతుందో ? అనే భయంతో సాటి నిందితులు హడలిపోతున్నారు.

బెంగళూరు టూ బళ్లారి సెంట్రల్ జైలు
బెంగళూరు అల్లర్లకు కారణం అయిన నిందితులను పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. నిందితులను 15 రోజులు రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అరెస్టు చేసిన నిందితులు అందర్నీ బెంగళూరు సెంట్రల్ జైలులో పెడితో మళ్లీ అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉందని అనుమానంతో గురువారం రాత్రికి రాత్రి 80 మంది నిందితులను బెంగళూరు సీసీబీ, కేఎస్ ఆర్ పీ పోలీసుల కట్టుదిట్టమైన భద్రతతో బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు.

రెచ్చిపోతే చచ్చిపోతారు
బెంగళూరులోని డీజే హళ్లి, కేజీ హళ్ళి ప్రాంతాల్లో రెచ్చిపోయి అరెస్టు అయిన వాళ్లు బళ్లారి సెంట్రల్ జైల్లో రెచ్చిపోతే పోలీసుల దెబ్బలు గ్యారెంటీ అని సమాచారం. జైల్లో సాధారణ ఖైదీల్లాగే ఉంటే సరిపోతుందని, గొంతెమ్మ కోరికలు కోరినా, నానా హంగామా చెయ్యడానికి ప్రయత్నించినా ఫలితం వేరుగా ఉంటుందని, జైలు వాళ్ల అత్తగారిల్లు కాదని పోలీసులు అంటున్నారు.

అర్దరాత్రి పోయేకాలం వచ్చింది
బెంగళూరు సిటీలోని డీజే హళ్ళి, కేజీ హళ్ళి ప్రాంతాల్లో ఆగస్టు 11వ తేదీ అర్దరాత్రి అల్లరిమూకలు రెచ్చిపోయారు. ఓ వర్గం దేవుడిని కించపరిచి ఫేస్ బుక్ లో పోస్టు చేశారని ఆరోపిస్తూ అల్లరిమూకలు రెచ్చిపోయారు. పులకేశీనగర ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్ ఫోస్ బుక్ లో ఆ పోస్టు చేశాడని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిని తగలబెట్టారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే ఇంటి పరిసర ప్రాంతాల్లో పార్క్ చేసిన వందలాది వాహనాలు, బీమ్స్ ఆసుపత్రి ముందు పార్క్ చేసిన అంబులెన్స్ లకు నిప్పంటించి బూడిద చేశారు. ఇదే సమయంలో అల్లరిమూకలను అదుపు చెయ్యడానికి పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించారు.












Click it and Unblock the Notifications