బీజేపీ నేత దారుణహత్య: బైక్పై వెంటాడి నరికివేత: రాత్రంతా తీవ్ర ఉద్రిక్తత: సీఎం దిగ్భ్రాంతి
బెంగళూరు: కర్ణాటకలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. అధికార భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. దక్షిణ కన్నడ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లాస్థాయి బీజేపీ నాయకులు, యువమోర్చా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. అర్ధరాత్రి నిరసన ప్రదర్శనలను చేపట్టారు. రోడ్డుపై బైఠాయించారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినదించారు. రాత్రాంతా దక్షిణ కన్నడ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బైక్పై వెంటాడి..
హతుడి పేరు ప్రవీణ్ నెట్టారు. దక్షిణ కన్నడ జిల్లా బీజేపీ యువమోర్చా నాయకుడు. జిల్లాలోని సుళ్య తాలుకా బెళ్లారపేటె ఆయన స్వస్థలం. కేరళ సరిహద్దులకు సమీపంలో ఉంటుందీ గ్రామం. స్థానికంగా ఓ పౌల్ట్రీ షాప్ను నిర్వహిస్తోన్నారు. రాత్రి షాప్ను మూసివేసి, ఇంటికి బయలుదేరి వెళ్తోన్న సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను బైక్పై వెంటాడి మరీ నరికి చంపారు. షాప్ షట్టర్ను క్లోజ్ చేస్తోన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్పై ఆయన వద్దకు వచ్చారు.
నిరసనలు..
ఆ వెంటనే కత్తులతో దాడికి దిగారు. దీనితో ఆయన తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించగా.. బైక్పై వెంటాడి నరికి చంపారు. రక్తపు మడుగులో పడివున్న అతణ్నిస్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హుటాహుటిన పుత్తూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రవీణ్ మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక బీజేపీ నాయకులు, యువమోర్చా కార్యకర్తలు పెద్ద ఎత్తున పుత్తూరుకు తరలివచ్చారు. అక్కడే బైఠాయించారు. నిరసన ప్రదర్శనలకు దిగారు.

ముస్లిం యువకుడి హత్యతో..
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలు పెట్టారు. ఆ బైక్ కేఎల్ (కేరళ) రిజిస్ట్రేషన్గా పోలీసులు నిర్ధారించారు. హత్యకు గల కారణాలపై అన్వేషణ సాగిస్తోన్నారు. మూడురోజుల కిందటే ఇదే కెలంజెలో మసూద్ అనే ముస్లిం యువకుడు హత్యకు గురయ్యాడు. అతని స్వరాష్ట్రం కేరళ. తండ్రి మరణించడంతో కెలంజెలో నివసిస్తోన్న తన అమ్మమ్మ ఇంటికి వచ్చి, ఇక్కడే స్థిరపడ్డాడు. జీవనోపాధి కోసం పెయింటర్గా పని చేస్తుండే వాడు.

వీహెచ్పీ కార్యకర్తలు అరెస్ట్..
అతణ్ని హత్య చేసిన కేసులో స్థానిక పోలీసులు ఎనిమిది విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. సుధీర్, సునీల్ కెలంజె, అభిలాష్, బెల్లారె, జిమ్ రంజిత్, శివప్రసాద్, భాస్కర్, రంజిత్, సదాశివ ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉన్నారు. ఈ హత్యకు ప్రతీకారంగా తాజాగా బెల్లారెలో ప్రవీణ్ నెట్టారును నరికి చంపారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తోన్నారు. మసూద్ స్వరాష్ట్రం కేరళ కావడం.. ప్రవీణ్ నెట్టారును హత్య చేయడానికి దుండగులు వినియోగించిన బైక్ కేఎల్ రిజిస్ట్రేషన్ కావడం వల్ల ఈ రెండు హత్యలకు లింక్ ఉందని అనుమానిస్తోన్నారు.

ప్రవీణ్ నెట్టారు హత్యపై
ప్రవీణ్ నెట్టారు హత్యోదంతంపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన యువ నాయకుడు దారుణహత్యకు గురికావడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రవీణ్ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. నిందితులను త్వరగా పట్టుకుంటామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రవీణ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.












Click it and Unblock the Notifications