‘గాలి’ కొత్త రాజకీయ పార్టీ - వెనుక ఉన్నదెవరు..!?
గాలి జనార్ధన రెడ్డి మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్దమయ్యారు. కర్ణాటకలో ప్రత్యక్షంగా - తెలుగు రాజకీయాలతో పరోక్ష సంబంధాలు ఉన్న గాలి జనార్ధన రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు ఇప్పుడు సంచలనంగా మారుతోంది. కొద్ది రోజుల క్రితం వైసీపీ కర్ణాటకలో విస్తరణ దిశగా కసరత్తు చేస్తోందంటూ ప్రచారం సాగింది. దీనిని పార్టీ నేతలు ఖండించారు.
ఇతర రాష్ట్రాల పై వైసీపీకి ఆసక్తి లేదని ఆ పార్టీ ముఖ్యనేత సజ్జల తేల్చి చెప్పారు. అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు ద్వారా తమ తొలి లక్ష్యం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలేనని వెల్లడించారు. ఇప్పుడు ఇదే సమయంలో గాలి జనార్ధన రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.
ఎన్నికల కమిషన్కు దరఖాస్తు
మైనింగ్ కింగ్ గాలి జనార్ధన రెడ్డి ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటుకు నిర్ణయించారు. గతంలోనూ ఆయన పార్టీ ఏర్పాటు చేసి ఆ తరువాత బీజేపీలో దానిని విలీనం చేసారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ) పేరుతో ఈనెల 10న ఢిల్లీలో ఎన్నికల కమిషన్ వద్ద కొత్త పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. గతంలో బుడా ఛైర్మన్ గా పని చేసిన ఓ నాయకుడిని పార్టీ అధ్యక్షుడిగా పేర్కొన్నారని తెలుస్తోంది.
గతంలో హైదరాబాద్ కర్ణాటకగా ఉన్న ప్రాంతం ఇప్పుడు కల్యాణ కర్ణాటకగా మారింది. కల్యాణ కర్ణాటకలో బళ్లారి, రాయచూరు, యాదగిరి, కలబురగి(గుల్బర్గా) కొప్పళ, విజయనగర జిల్లాల పరిధిలో 48 అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో గాలి తన మద్దతుదారులను పార్టీ తరపున రంగంలోకి దింపాలని యోచిస్తున్నారు. నెల రోజుల్లోగా ఎన్నికల సంఘం పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తి చేయనుంది. గుర్తు కేటాయించే అవకాశం ఉంది. గతంలో బీఎస్ఆర్ పార్టీ స్థాపించిన గాలి జనార్ధన రెడ్డి ఆ తరువాత ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసారు.
బీఆర్ఎస్ ఫోకస్ చేసిన ప్రాంతంలోనే...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటైన బీఆర్ఎస్ కర్ణాటక ఎన్నికల్లో పోటీకి సిద్దం అవుతోంది. కర్ణాటకలో బీఆర్ఎస్ కు ఆదరణ దక్కుతుందని సీఎం అంచనా వేస్తున్నారు. అక్కడ కుమార స్వామిని తిరిగి సీఎం చేయటం లక్ష్యంగా పని చేస్తామని పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో స్పష్టం చేసారు. 2023లో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ తరువాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ సమయంలో గాలి జనార్ధన రెడ్డి కొత్త పార్టీ ఎంచుకున్న ప్రాంతం ఆసక్తిగా మారుతోంది. బీఆర్ఎస్ ఇదే ప్రాంతం పైన ఓట్లు సాధిస్తామనే నమ్మకం పెట్టుకుంది. గతంలో హైదరాబాద్ కర్ణాటకగా ఉన్న ప్రాంతం కావటంతో పాటుగా.. తెలుగు రాష్ట్రాలతో సంబంధాలు కలిగిన వారు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. దీంతో, ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి కొత్త పార్టీ బీఆర్ఎస్ అంచనాలను దెబ్బ తీస్తుందా.. లేక, బీఆర్ఎస్ ఆ పార్టీకి చెక్ పెడుతుందా.. ఈ రెండు పార్టీలు ఎవరి ఓట్ బ్యాంక్ పైన ప్రభావం చూపుతాయనే చర్చ సాగుతోంది.
కుమార స్వామికి మద్దతుగా సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియలో తొలి నుంచి కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి మద్దతుగా నిలిచారు. తాజాగా పార్టీ ఆవిర్భావం...ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభానికి హాజరయ్యారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండగా.. కాంగ్రెస్ ఈ సారి తమకు అధికారం ఖాయమనే ధీమాతో ఉంది.
ఈ సమయంలో జేడీఎస్ తాము మరోసారి కింగ్ లేదా కింగ్ మేకర్లుగా మారుతామనే అంచనాతో ఉన్నారు. కుమార స్వామికి బీఆర్ఎస్ మద్దతుగా నిలవనుంది. ఈ సమయంలో గాలి జనార్ధన రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు..నమ్ముకున్న ఓట్ బ్యాంక్ సమీకరణాలు ఆసక్తిగా మారుతున్నాయి.
తన కొత్త పార్టీ గురించి గాలి జనార్ధన రెడ్డి అధికారికంగా స్పందించాల్సి ఉంది. గాలి సన్నిహితులు కొత్త పార్టీ ఏర్పాటు కసరత్తు ఏమీ లేదని చెబుతున్నారు. కానీ, గాలి జానర్ధనరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు వ్యవహారం పైన మాత్రం కర్ణాటక రాజకీయాల్లో చర్చ కొనసాగుతోంది.