Bengaluru: క్వారీల్లో సామూహిక అంత్యక్రియలు, పేరుకు ఐటీ హబ్, రోజూ వందల్లో మృతులు, పాపం!
బెంగళూరు: దేశ ఐటీ హబ్ గా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు సిటీలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ప్రతిరోజు బెంగళూరులో వందల సంఖ్యలో కోవిడ్ బారిన ప్రజలు మరణిస్తున్నారు. బెంగళూరు సిటీలో స్మశానాలు ఫుల్ అయిపోవడంతో హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేస్తున్నారు. బెంగళూరు నగర శివారల్లోని గిడ్డేనహళ్లి క్వారీలో, తావరకెరెలో ప్రభుత్వం గుర్తించిన ప్రాంతాల్లో సామూహిక అత్యసంస్కారాలు చేస్తున్నారు.
Recommended Video
ఒక్కరోజులో బెంగళూరులో కరోనా వైరస్ దెబ్బతో 285 మంది ప్రాణాలు పోయాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాగడానికి మంచినీళ్లు కూడా చిక్కని కొండల్లోని క్వారీల్లో కోవిడ్ తో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.
Bengaluru: కోవిడ్ పంజా సీక్రెట్ ఇదే, అపార్ట్ మెంట్స్ లో ఆ మహిళలు చేస్తున్న పనే ?, రహస్యం!
పేరుకు ఐటీ హబ్
ప్రపంచ దేశాల్లో ఐటీ హబ్ గా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు నగరంలో వారం రోజుల నుంచి సంపూర్ణ లాక్ డౌన్ అమలులో ఉంది. బెంగళూరులో లాక్ డౌన్ అమలులో ఉన్నా కరోనా వైరస్ దెబ్బకు అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కరోనా వైరస్ తో ప్రాణాలు పోయిన వారి అంత్యసంస్కారాలు చెయ్యడానికి స్మశానాల్లో ఖాళీ లేకపోవడంతో ఇప్పటికే హౌస్ ఫుల్ బోర్డులు తగిలించడం కలకలం రేపింది.
ఇవి బెంగళూరు చావుల లెక్కలు
కర్ణాటకలో కరోనా వైరస్ దెబ్బతో లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. కర్ణాటకలో ప్రతిరోజు కొన్ని వేల సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు హడలిపోతున్నారు. కరోనా వైరస్ చికిత్స విఫలమై కర్ణాటకలో ఒక్కరోజులో 482 మంది చనిపోయారు. ఐటీ హబ్ బెంగళూరులో కరోనా వైరస్ దెబ్బతో 24 గంటల్లో (శనివారం మాత్రమే) 285 మంది ప్రాణాలు పోయాయి.
రోజుకు 40 శవాలు తరలింపు
బెంగళూరులోని వివిద ప్రాంతాల్లో కోవిడ్ పాజిటివ్ తో చనిపోయిన వారి శవాలను సిటీ శివార్లలోని గిడ్డేనహళ్లిలోని క్వారీలోకి, తావరకెరేలో ప్రభుత్వం గుర్తించిన ప్రాంతంలోని తాత్కాలిక స్మశానవాటికల్లోకి తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తున్నారు. సిటీ శివార్లలో కూడా సమయం లేకపోవడం, సక్రమంగా స్థలాలు లేకపోవడంతో సామూహిక అంత్యసంస్కారాలు చేసేస్తున్నారు. బెంగళూరు నగర శివార్లలో రోజు సరాసరి 30 నుంచి 40 శవాలకు సామూహిక అత్యసంస్కారాలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
తాగడానికి మంచినీళ్లు కరువు
గిడ్డేనహళ్లి ప్రాంతంలోని క్వారీని పూర్తిగా చదును చేసి అక్కడ సుమారు 30 వరకు ఇనుముతో తయారు చేసిన తాత్కాలిక బ్యారెక్ (శవాలు కాల్చడానికి) లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఇనుప బ్యారెక్ లో కోవిడ్ తో చనిపోయిన వారి శవాలను కాల్చి బూడిద చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్మశానవాటిలో పని చేస్తున్న వారికి సరైన సదుపాయాలు కరువైనాయని, కనీసం తాగడానికి సరైన సమయంలో మంచినీళ్లు కూడా చిక్కడం లేదని అక్కడ పని చేస్తున్న సురేష్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడని ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రచురించింది.
పొట్టకూటి కోసం.... వేరే దిక్కులేదు
ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది ప్రతిరోజు 12 నుంచి 13 గంటల పాటు కోవిడ్ వ్యాధితో చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. క్వారీలు మూసివేయడంతో వేరే పని చెయ్యడానికి అవకాశం లేకుండా పోయిందని, అనుభవం లేకపోయినా కొందరు ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించడానికి సహాయం చేస్తున్నారని సురేష్ విచారం వ్యక్తం చేస్తున్నాడని సమాచారం.
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము
బెంగళూరులో చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించడానికి నగర శివార్లలోని గిడ్డేనహళ్ళి, తావరకెరె ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశామని, ప్రభుత్వం వాటి ఖర్చులను భరిస్తోందని బెంగళూరు అర్బన్ జిల్లా కమీషనర్ మంజునాథ్ చెప్పారని ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ దినపత్రిక కథనం వెల్లడించింది. మొత్తం మీద బెంగళూరులోని స్మశానాలు మొత్తం నిండిపోవడం, ఇప్పటికే ఓ స్మశానవాటిక కేంద్రం పూర్తిగా మూసివేయడంతో నగరంలో కోవిడ్ వ్యాధితో చనిపోయిన వారి అంత్యక్రియలు నగర శివార్లలోని కొన్ని కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తున్నారు.