బెంగళూరులో భూకంపం: ఉలిక్కిపడ్డ ఉద్యాననగరి
జకర్తా: సిలికాన్ సిటీ బెంగళూరులో భూకంపం సంభవించింది. బెంగళూరు నార్త్, ఈశాన్య ప్రాంతంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. చిక్బళ్లాపుర జిల్లాలో ప్రకంపనలు నమోదయ్యాయి. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో బెంగళూరియన్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీని గురించి ఆరా తీస్తోన్నారు. భూకంప తీవ్రత తక్కువగా ఉండటం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించలేదని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఈ ఉదయం 7:14 నిమిషాలకు భూకంపం సంభవించింది. బెంగళూరుకు ఉత్తరం, ఈశాన్య దిశగా 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఉపరితలం నుంచి 23 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల ఈ భూకంపం సంభవించినట్లు స్పష్టం చేసింది. తొలుత ఈ ఉదయం 7:09 నిమిషాలకు 3.1 తీవ్రతతో భూమి కంపించినట్లు సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. కొద్దిసేపటికే దాన్ని పునఃసమీక్షించింది.
దీని తీవ్రత మరంత అధికంగా ఉన్నట్లు గుర్తించింది. భూకంపం సంభవించిన సమయాన్ని కూడా సవరించింది. దీని తీవ్రతను 3.3గా నిర్ధారించింది. కర్ణాటకలో ఈ మధ్యకాలంలో వరుసగా స్వల్ప స్థాయి భూ ప్రకంపనాలు నమోదయ్యాయి. ప్రత్యేకించి- కర్ణాటక ఉత్తర ప్రాంతంలో దీని తీవ్రత కనిపించింది. ఈ ఏడాది అక్టోబర్లో బీదర్, కలబురగి, విజయపుర జిల్లాల్లో ఇవి నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3 నుంచి 4 వరకు రికార్డయ్యాయి. దీన్ని హైడ్రో సెస్మీసిటీగా నిర్ధారించారు అధికారులు.
Earthquake of Magnitude:3.3, Occurred on 22-12-2021, 07:14:32 IST, Lat: 13.55 & Long: 77.76, Depth: 23 Km ,Location: 66km NNE of Bengaluru, Karnataka, India for more information download the BhooKamp App https://t.co/iax6vbE3wO pic.twitter.com/irvoaQmaMF
— National Center for Seismology (@NCS_Earthquake) December 22, 2021
కృష్ణా నదీ తీర ప్రాంతం కావడం వల్ల వర్షాకాలం ఆరంభ సమయంలో, ఆ తరువాత ఈ హైడ్రో సెస్మీసిటీ రికార్డవుతుంటుందని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కర్ణాటక డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది ఆరంభం నుంచి అక్టోబర్ వరకు కనీసం 15 సార్లు భూమి స్వల్ప స్థాయిలో కంపించిందని పేర్కొన్నారు. హసరగుండ్గి, యెలకలహళ్లి, చించోలి వంటి ప్రాంతాల్లో స్వల్పంగా భూప్రకంపనలు నమోదవుతుంటాయని చెప్పారు.