ఉక్రెయిన్ లో నవీన్ డెడ్ బాడీ: మృతదేహాన్ని తరలిస్తే- బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..!!
ఉక్రెయిన్ లో రష్యా యుద్దంలో భారతీయ విద్యార్ది మరణించారు. రష్యా కొనసాగిస్తున్న దాడుల్లో ఇటీవల కర్నాటకకు చెందిన నవీన్ శేఖరప్ప మరణించారు. భారత విదేశాంగ శాఖ సైతం దీనిని నిర్దారించింది. ఉక్రెయిన్ విచారం వ్యక్తం చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రదాని మోదీ సైతం స్పందించారు. అయితే, నవీన్ మృతదేహం కోసం కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. తమ బిడ్డను కడసారి చూపించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే, నవీన్ మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వారికి సమాచారం ఇచ్చారు.
బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పదంగా
ఇదే సమయంలో కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్సద వ్యాఖ్యలు చేశారు. హుబ్లీ-ధార్వాడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ స్పందిస్తూ.. విమానంలో మృతదేహాన్ని తరలిస్తే ఎక్కువ చోటు ఆక్రమిస్తుందంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. యుద్దం జరుగుతున్న ప్రాంతం నుంచి జీవించి ఉన్న వారిని తీసుకురావటానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితుల్లో చనిపోయిన వారిని తీసుకురావటం చాలా కష్టమైన పనిగా పేర్కొన్నారు.
విమానంలో ఎక్కువ స్థలం అంటూ
విమానంలో మృతదేహం ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుందని.. ఆ స్థలంలో అక్కడ చిక్కుకున్న వారిలో 8 నుంచి పది మంది వరకూ కూర్చొని స్వదేశానికి తీసుకురావచ్చంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు వీటిని పలువురు తప్పు బడుతున్నారు. ఇదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి తమకు రెండు రోజుల్లో తమ కుమారుడి డెడ్ బాడీ తీసుకొస్తామని హామీ ఇచ్చిందని నవీన్ తండ్రి జ్ఞానగౌడ్ తెలిపారు. తన కుమారుడి మృతదేహాన్నిఇంటికి తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా తాను ప్రధాని మోదీని, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని అభ్యర్థించినట్లు ఆయన చెప్పారు.
కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు అండగా
కాగా, కేంద్రం ఆపరేషన్ గంగా పేరుతో ఇప్పటికే దాదాపుగా 16 వేల మందిని స్వదేశానికి తరలించింది. రానున్న రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో ఆపరేషన్ చేపడతామని చెబుతోంది. ఇదే సమయంలో ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి వారిని రప్పించేందుకు వాయుసేన విమానాలు రంగంలోకి దిగాయి. నలుగురు కేంద్ర మంత్రులు స్వయంగా ఆ దేశాల్లో తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా, ఉక్రెయిన్ లో మరో భారతీయ విద్యార్ధి రష్యా జరుపుతున్న కాల్పుల్లో గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.