EMIలే ఆయుధం! ప్రీమియం మార్కెట్ను కైవసం చేసుకున్న ఆపిల్
ఇప్పుడు భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ అంటే ఇక కేవలం చౌక ఫోన్ల కథ కాదు. ఖరీదైన ఫోన్ల వైపు వినియోగదారులు ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ మారుతున్న అభిరుచుల మధ్య టెక్ దిగ్గజం ఆపిల్ (APPLE) సంచలన రికార్డు సృష్టించింది. ధరలు భారీగా ఉన్నప్పటికి సేల్స్ కూడా అలాగే ఉన్న నేపథ్యంలో ఉహించని విధంగా ఆపిల్ నెంబర్వన్ స్థానానికి చేరుకుంది.
భారత్లో స్మార్ట్ఫోన్ మార్కెట్ విలువలో 28 శాతం వాటాను సొంతం చేసుకుని ఆపిల్ నెంబర్వన్ స్థానానికి చేరుకుంది. కౌంటర్పాయింట్ రీసెర్చ్ తాజా నివేదిక ప్రకారం, భారత వినియోగదారులు అధిక ధర ఉన్న ప్రీమియం డివైజ్లను ఎంచుకోవడమే ఈ వృద్ధికి ప్రధాన కారణం. మార్కెట్లో 'ప్రీమియంజేషన్' ట్రెండ్ బలంగా పెరుగుతుండటంతో, ఆపిల్ ఐఫోన్లు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ముఖ్యంగా ఐఫోన్ 16 సిరీస్ షిప్మెంట్లు కంపెనీకి భారీ బలం ఇచ్చాయి. భారత్ ఇప్పటికే ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్. ఇక్కడ ఇప్పుడు ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఫోన్ల విక్రయాల సంఖ్య (వాల్యూమ్) పెద్దగా పెరగకపోయినా, ఖరీదైన మోడళ్లకు డిమాండ్ పెరగడంతో మొత్తం మార్కెట్ విలువ వేగంగా ఎగబాకుతోంది.

భారత్ లో Apple వాటా..
2024లో భారత మార్కెట్లో ఆపిల్ విలువ వాటా 23 శాతంగా ఉండగా, 2025లో అది నేరుగా 28 శాతానికి చేరింది. ఐఫోన్ 16 సిరీస్ విజయానికి తోడు, ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆఫర్లు, ట్రేడ్-ఇన్ డీల్స్, పండుగ ఆఫర్లు ఈ వృద్ధికి ఊతమిచ్చాయని నివేదిక పేర్కొంది. 2025లో భారత్లో అత్యధికంగా విక్రయమైన మోడల్గా ఐఫోన్ 16 నిలవడం విశేషం. మొత్తం మార్కెట్ విషయానికి వస్తే, 2025లో భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ వాల్యూమ్ పరంగా 1 శాతం, విలువ పరంగా 8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది వినియోగదారుల కొనుగోలు ధోరణిలో వచ్చిన మార్పును స్పష్టంగా చూపిస్తోంది.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఫైనాన్సింగ్ పాత్ర. 2025లో కీలక రిటైల్ స్టోర్లలో జరిగిన స్మార్ట్ఫోన్ అమ్మకాలలో 40 శాతం కొనుగోళ్లు EMI లేదా ఇతర ఫైనాన్స్ సౌకర్యాల ద్వారానే జరిగాయి. రూ.30,000కు పైగా ధర ఉన్న ప్రీమియం ఫోన్లలో అయితే, దాదాపు రెండు మూడో వంతు కొనుగోళ్లు ఫైనాన్స్ ఆధారంగానే జరిగాయి. ఖరీదైన ఫోన్లకు అప్గ్రేడ్ కావడంలో EMIలు కీలకంగా మారినట్లు ఇది సూచిస్తోంది. కౌంటర్పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ, రూ.30,000 పైగా ధర ఉన్న ప్రీమియం విభాగమే 2025లో అత్యంత వేగంగా వృద్ధి చెందిన సెగ్మెంట్ అని తెలిపారు. ఈ విభాగం సంవత్సరానికి 11 శాతం వాల్యూమ్ వృద్ధిని నమోదు చేసి, మొత్తం షిప్మెంట్లలో 22 శాతం వాటాను దక్కించుకోవడం రికార్డు స్థాయి అని చెప్పారు. ఇదే మొత్తం మార్కెట్ విలువ 8 శాతం పెరగడానికి ప్రధాన కారణమని ఆయన వివరించారు.
శామ్సంగ్ కూడా తన బలాన్ని..
2026 ప్రారంభంలో మార్కెట్ మరింత స్పష్టంగా విభజన (పోలరైజేషన్) వైపు సాగుతుందని అంచనా. ప్రీమియం ఫోన్లు విలువ వృద్ధిని నడిపిస్తుండగా, ఎంట్రీ-లెవల్, తక్కువ ధర ఫోన్ల విక్రయాలు ఒత్తిడిలో ఉండే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఆపిల్ విలువలో అగ్రస్థానంలో నిలిచినా, శామ్సంగ్ కూడా తన బలాన్ని చాటుకుంది. 2025లో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ విభాగంలో శామ్సంగ్ 88 శాతం వాల్యూమ్ వాటాతో స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగించింది. A, M, F సిరీస్లతో మాస్ మార్కెట్లో, S సిరీస్తో ప్రీమియం విభాగంలో స్థిరమైన పురోగతిని సాధించింది.
ఇక వాల్యూమ్ వృద్ధిలో మోటరోలా 54 శాతం వార్షిక వృద్ధితో అత్యంత వేగంగా పెరిగిన బ్రాండ్గా నిలిచింది. అదే సమయంలో CMF 83 శాతం వృద్ధితో అత్యంత వేగంగా ఎదిగిన సబ్-బ్రాండ్గా గుర్తింపు పొందింది.
భవిష్యత్తుపై దృష్టి పెడితే, 2026లో భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ సింగిల్-డిజిట్ వాల్యూమ్ క్షీణతను ఎదుర్కొనే అవకాశముందని అంచనా. మెమరీ, ఇతర విడిభాగాల ధరలు పెరగడం వల్ల డిమాండ్ తగ్గవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రూ.15,000 కంటే తక్కువ ధరల విభాగంపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. అదే సమయంలో, తయారీదారులు ప్రీమియం సెగ్మెంట్పై మరింత దృష్టి పెట్టడం, ధరలు పెంచడం వల్ల సగటు విక్రయ ధరలు సంవత్సరానికి 5-7 శాతం పెరిగే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications