ఎల్వోయూలపై నిషేధం చిన్న సంస్థలకు దెబ్బ.. ‘నేమ్ అండ్ షేమ్’ ప్రచారానికి సర్కార్ సిద్ధం
న్యూఢిల్లీ: వ్యాపార సంస్థలకు లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ (ఎల్వోయూ)లను నిషేధిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తీసుకున్న నిర్ణయం వ్యాపారాలపై తక్షణ ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ముఖ్యంగా చిన్న వ్యాపార సంస్థలు మరింత నిర్వహణ మూలధనాన్ని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రూ. 13వేల కోట్ల కుంభకోణం దరిమిలా దిగుమతిదారులు రుణ సదుపాయం పొందేందుకు ఉపయోగపడే ఎల్వోయూలను ఇకపై జారీ చేయొద్దంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించిన నేపథ్యంలో పరిశ్రమ వర్గాల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇతర మార్గాలవైపు మళ్లాల్సి ఉంటుందని సీఐఐ ఆందోళన
ఆర్బీఐ నిర్ణయం దిగుమతి సంస్థల కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తుందని, చాన్నాళ్లుగా ఎల్వోయూల ఆధారంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న ట్రేడర్లు తాజా పరిణామంతో తప్పనిసరిగా లెటర్స్ ఆఫ్ క్రెడిట్, బ్యాంక్ గ్యారంటీ వంటి మార్గాల వైపు మళ్లాల్సి వస్తుందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ అధ్యక్షురాలు శోభన కామినేని పేర్కొన్నారు.
ఎల్వోయూల నిషేధంపై పీహెచ్డీ చాంబర్ ఇలా
కుంభకోణాలను అరికట్టేందుకు ఈ మార్గాలను నిషేధించడం పరిష్కార మార్గం కాదని పీహెచ్డీ చాంబర్ ప్రెసిడెంట్ అనిల్ ఖేతాన్ అన్నారు. లావాదేవీలకు అనుగుణంగా మూలధనాన్ని నిర్వహించుకునే చిన్న తరహా సంస్థలపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. తాజా పరిణామంతో అవి మరింత అధిక నిర్వహణ మూలధనాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుందని లేకపోతే భారీగా నష్టపోవాల్సి వస్తుందని ఖేతాన్ వివరించారు.
మిగతా వ్యవస్థలకు పాకకుండా చూసుకోవాలని సూచన ఇలా
నీరవ్ మోదీ స్కామ్ నేపథ్యంలో బ్యాంకులు ఎల్వోయూలు జారీ చేయకుండా ఆర్బీఐ నిషేధం విధించిన నేపథ్యంలో ఈ తరహా చర్యల విషయంలో జాగ్రత్తగా వ్యహరించాలని ప్రధానమంత్రి ముఖ్య ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ విధాన కర్తలకు సూచించారు. ఒక మార్గాన్ని మూసివేసే చర్య మిగిలిన వ్యవస్థకు పాకకుండా చూడాలని, ఎందుకంటే సిలో వ్యవస్థతో వ్యవహరించడం లేదని గుర్తు చేశారు.
పీఎస్బీల బలోపేతానికే ఆర్థిక శాఖ చర్యలు ఇలా
ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) పటిష్టం చేసే క్రమంలో భాగంగా ఆర్థిక శాఖ కీలక చర్యలకు దిగాలని యోచిస్తున్నది. ఆయా బ్యాంకుల్లో రుణాలను తీసుకొని వాటిని తిరిగి చెల్లించకుండా ఉన్న ఉద్దేశపూర్వక ఎగవేత దారుల పేర్లు, ఫొటోలను ఆయా బ్యాంకు వెబ్సైట్లలో ప్రచురించాలని సర్కారు బ్యాంకులను కోరింది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ గతంలో జారీ చేసిన విధి విధానాలను ఉఠంకిస్తూ ఆర్థిక శాఖ పీఎస్బీలకు తాజాగా ఆదేశాలను జారీ చేసింది.
బోర్డు నిర్ణయాల మేరకు వెబ్ సైట్లలో ఎగవేతదారుల ఫోటోలు ప్రచురించాలి
'నేమ్ అండ్ షేమ్' కార్యక్రమంలో భాగంగా మరింత కఠిన నిర్ణయాలను తీసుకొంటూ ఉద్దేశపూర్వక ఎగవేతదారుల ఆట కట్టించేందుకే తాము తాజా చర్యలకు దిగుతున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇందుకు ఆయా బ్యాంకులు ఒక విధానాన్ని రూపొందించుకొని దానిని బోర్డు సమ్మతి తీసుకొవాలని. సదరు విధానాల ప్రకారమే ఉద్దేశపూర్వక ఎగవేతదారుల ఫొటోలను ప్రచురించాలని ఆర్థిక శాఖ సూచించింది.