2018లో బడ్జెట్: నిపుణుల అంచనాలను జైట్లీ చేరుకుంటారా?
న్యూఢిల్లీ: సరిగ్గా మరో వారం రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొత్త బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2018-19) వచ్చే నెల ఒకటో తేదీన ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ ఎలా ఉండబోతున్నది? నిపుణుల అంచనాలేమిటీ? పరిశ్రమ వర్గాలు ఏం కోరుతున్నాయి? ఏ రంగానికి ఎన్ని నిధులు దక్కుతాయి? ఎలాంటి మేలు జరుగుతుందన్న సంగతిపై మధ్యతరగతి వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Recommended Video

ముఖ్యంగా వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ సర్కార్ ఐదేళ్ల పాలనలో ఈ చివరి పూర్తికాల బడ్జెట్ ఎవరికి ఏమి ఇవ్వనున్నది? ఎవరి నుంచి ఏం తీసుకోనున్నది? దేశ ఆర్థిక వ్యవస్థను పాత పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ప్రభావితం చేసిన నేపథ్యంలో అసలు జైట్లీ బ్రీఫ్కేస్లో ఏం తెస్తున్నారన్నది తేలాలంటే మరో వారం ఆగాల్సిందే.

ఉత్పాదకతకు ఊతమిచ్చే 'మేకిన్ ఇండియా' ఇలా
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశీయ ఉత్పాదక రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలు ఉండవచ్చు. స్థానిక విద్యుత్, క్యాపిటల్ గూడ్స్, కెమికల్స్ కంపెనీల కోసం విదేశీ దిగుమతులపై సుంకాన్ని పెంచవచ్చు. తద్వారా భారతీయ కంపెనీల్లో మరింత ఉత్పత్తి, ఉద్యోగావకాశాలకు వీలు కలుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఆరోగ్యరంగంలో కీలకమయ్యేందుకు ప్రైవేట్ రంగం అభిలాష
భారత ఆరోగ్య రంగంలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషించాలని అభిలషిస్తోంది. అందుకు పరిస్థితులనుకూలిస్తాయని చెబుతున్నారు. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యానికి (పీపీపీ) బాటలు పడుతాయని భావిస్తున్నారు. హెల్త్కేర్ పరిశ్రమలో నిర్మాణాత్మక పన్ను ప్రయోజనాలు, డయాగ్నస్టిక్స్ రంగంలో అధిక పెట్టుబడులకు ఆస్కారం ఉన్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కోసం మరిన్ని నిధులు కేటాయించవచ్చు. ఆరోగ్య బీమా పరిధి విస్తృతం కావచ్చు. ప్రైవేట్ హెల్త్ కేర్ సంస్థలు దేశవ్యాప్తంగా వైద్య బీమా కవరేజీ కల్పించడంలో కీలక పాత్ర పోషించాలని, దేశీయంగా వైద్య సేవల రంగాన్ని బలోపేతం చేయాలని ఆశిస్తున్నాయి. అందుకు 2018 - 19 బడ్జెట్లో మంత్రి జైట్లీ ప్రతిపాదనలు సమర్పిస్తారని ఆశిస్తున్నారు.
రైతుల రుణపరపతి పెంపుదలకు చర్యలు తీసుకునే అవకాశం
వ్యవసాయ రంగంలో రుణ పరపతిని మెరుగు పరిచేందుకు విత్త మంత్రి అరుణ్ జైట్లీ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కోట్లు కాగా, తాజాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.లక్ష కోట్లు పెంచి రికార్డు స్థాయిలో రూ.11 లక్షల కోట్లకు చేర్చే వీలు కల్పించడానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చర్యలు తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. వ్యవసాయ రంగానికి.. దానికి కీలకమైన ఇరిగేషన్ రంగానికి ఉద్దీపన పథకం అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. నష్టాల్లో ఉన్న రసాయన ఎరువుల తయారీ సంస్థలను ఆదుకోవాలన్న అభ్యర్థనలు వ్యక్తం అవుతున్నాయి.
వినియోగ వస్తువుల వాడకం పెంచాలి
ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను పెంచాలని ఆయా సంస్థలు కోరుతున్నాయి. గిడ్డంగుల నిర్మాణానికి ప్రోత్సాహకాలు ఉండాలని ఆశిస్తున్నాయి. గ్రామీణ ఆదాయ వనరులను పెంచి, ఆకర్షణీయ మార్కెట్కు మెరుగైన బాటలు వేయాలంటున్నాయి. ఆ దిశగా ఉపాధి కల్పనకు వీలుగా మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టాలని కోరుతున్నాయి. ప్రత్యేకించి గ్రామీణ మార్కెట్ల పరిధిలో పరిస్థితులపై ఎక్కువగా ద్రుష్టిని కేంద్రీకరించాలని చెప్తున్నారు. వేతనాల పెంపుతోపాటు వ్యక్తిగత ఆదాయంపై పన్ను శ్లాబులు తగ్గించాలని కోరుతున్నారు.
పరిశ్రమ హోదా కల్పించాలని కోరుతున్న నిర్మాణ రంగం
పరిశ్రమ హోదాను డిమాండ్ చేస్తున్న నిర్మాణ రంగం, సింగిల్ విండో అనుమతులు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఆర్ఈఐటీ లేదా రీట్)లపై పన్నుల హేతుబద్దీకరణ, జీఎస్టీ రేట్లలో తగ్గింపు, పర్యావరణ హిత భవనాల కోసం అధిక ప్రోత్సాహకాలను కోరుతున్నది. చక్కెర పరిశ్రమ కోసం షుగర్ డెవలప్మెంట్ కార్పస్ ఫండ్ను రూ.500 కోట్లకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిధి ద్వారా తక్కువ వడ్డీరేటుకే చక్కెర మిల్లులకు కేంద్రం రుణాలను అందిస్తుందన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications