Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Budget 2026: ఆ ఒక్క ప్రకటన.. నిమిషాల్లో రూ.8 లక్షల కోట్లు ఆవిరి!

Budget 2026: కేంద్ర బడ్జెట్ అంటే కేవలం పద్దులు మాత్రమే కాదు.. అది స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల గుండె దడను పెంచే రోజు కూడా. ఆదివారం నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించినప్పుడు మార్కెట్లు సానుకూలంగానే స్పందించాయి. కానీ ట్రేడర్లపై పన్నుల భారం పెంచుతూ ఆర్థిక మంత్రి తీసుకున్న ఓ నిర్ణయం మార్కెట్‌ను ఒక్కసారిగా పాతాళానికి నెట్టింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 2,400 పాయింట్లు, నిఫ్టీ 750 పాయింట్లు పడిపోవడంతో మదుపర్లు ఒక్కసారిగా విస్తుపోయారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 8 లక్షల కోట్లు ఆవిరైపోయింది.

ఆ ఒక్క ప్రకటనే కారణం
మార్కెట్ ఇలా పేకమేడలా కూలిపోవడానికి ప్రధాన కారణం సెక్యూరిటీ లావాదేవీల పన్ను పెంచడమే. గత కొంతకాలంగా స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం సెక్యూరిటీ లావాదేవీల పన్నును పెంచింది. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీ లావాదేవీల ట్యాక్స్ 0.025 శాతం నుంచి 0.05 శాతానికి, ఆప్షన్స్ ట్రేడింగ్‌పై 0.1శాతం నుంచి 0.15 శాతానికి పెంచడంతో ట్రేడర్లు బెంబేలెత్తిపోయారు. లావాదేవీల ఖర్చు పెరగడం వల్ల లాభాలు తగ్గుతాయన్న ఆందోళనతో భారీగా అమ్మకాలు మొదలై మార్కెట్ కుప్పకూలింది.

Budget 2026 Stock Market Crash Market Loses Rs 8 Lakh Crore as STT Hikes Sensex Dips 2400 Points

కొంతవరకు నిలదొక్కుకున్న మార్కెట్
అయితే ఇంత పెద్ద పతనం తర్వాత మార్కెట్ మళ్ళీ కొంతమేర కోలుకోవడం విశేషం. దీనికి బడ్జెట్‌లో ప్రకటించిన ఇతర సానుకూల అంశాలే కారణం. ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు కేటాయించడంతో పాటు ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.10,000 కోట్లు మంజూరు చేయడం ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తించింది. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యతతో ఐటీ షేర్లు పుంజుకున్నాయి. మార్కెట్ కనిష్ట స్థాయికి పడిపోయినప్పుడు, దిగ్గజ కంపెనీల షేర్లు తక్కువ ధరకు దొరకడంతో ఇన్వెస్టర్లు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. దీనివల్ల మార్కెట్ కొంతవరకు నిలదొక్కుకుంది.

రంగాల వారీగా విశ్లేషిస్తే.. !
ఇన్‌ఫ్రా, సిమెంట్ కంపెనీల షేర్లు లాభాల బాట పట్టాయి. ప్రభుత్వం కొత్తగా 7 హై-స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించడం ఈ రంగాలకు ఊతమిచ్చింది. మరోవైపు, విదేశీ మద్యం, పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెరగడంతో ఆయా కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఫార్మా రంగం మాత్రం మిశ్రమంగా స్పందించింది. క్యాన్సర్ మందులపై సుంకాల తగ్గింపు రోగులకు మేలు చేసినా, కంపెనీల లాభాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చూడాలి.

ప్రస్తుతానికి మార్కెట్ ఒడిదుడుకుల్లోనే ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లందరూ ఇప్పుడు సోమవారం ట్రేడింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం బడ్జెట్ కావడంతో కేవలం దేశీయ ఇన్వెస్టర్ల ప్రభావమే ఎక్కువగా ఉంది. కానీ సోమవారం విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత దిశానిర్దేశం ఎలా ఉంటుందనేది కీలకం కానుంది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ప్రభుత్వం ఇన్‌ఫ్రాపై చేస్తున్న ఖర్చు సానుకూలమే అయినా, స్వల్పకాలిక ట్రేడర్లకు మాత్రం పెరిగిన పన్నుల భారం ఒక చేదు నిజంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+